24 గంటల్లో కాళీమాత ఆలయ ఘటనపై స్పందించాలని డిమాండ్
సీఎం కేసీఆర్కు బీజేపీ నేత బండి సంజయ్ డెడ్లైన్ విధించారు. కాళీమాత ఆలయ ఘటనపై 24 గంటల్లో సీఎం, డీజీపీ మహేందర్రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం స్పందించకపోతే ఉద్యమం తప్పదని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ చేపట్టబోయే ఉద్యమానికి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందువో.. బొందువో సీఎం కేసీఆరే తేల్చుకోవాలన్నారు. తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతోందో పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన మాత్రాన కేసీఆర్ హిందువు కాలేడని చెప్పారు. కాళీమాత భూముల కబ్జాకు సహకరించిన డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడిపించుకునేందుకు డబీర్ పూర పోలీసు స్టేషన్ కు వెళ్తుంటే చిటికెలు వేస్తూ తనను పోలీస్ స్టేషన్ కు వెళ్ళనీయమని చెప్పాడన్నారు. మహిళలపై డీసీపీ దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎంఐఎం కార్యకర్తలకు డీసీపీ వత్తాసు పలుకుతున్నారని సంజయ్ ఆరోపించారు.