అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

అయోధ్య  శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జనవరి 18వ తేదీ గురువారం సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపర్చడం విశేషం.  8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో  తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించి శాలువాతో సత్కరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్  స్వయాన తన చేతులతో తయారు చేసిన  బంగారు చీర చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు.  గతంలో అగ్గిపెట్టెలో చీరను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని... చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని బండి సంజయ్ హమీ ఇచ్చారు.