- బీఆర్ఎస్కు ఓటేస్తే.. గెలిచినోళ్లంతా కాంగ్రెస్ గూటికే..
- కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకారంతో మేయర్ పీఠం
- దక్కించుకునేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తున్నదని కామెంట్
- సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలి: కిషన్రెడ్డి
- త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం: రాంచందర్రావు
- సికింద్రాబాద్లో బీజేపీ మున్సిపల్, కార్పొరేషన్
- ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం
హైదరాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే ప్రధాని మోదీని ఒప్పించి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణ స్థానిక సంస్థల్లో నయాపైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ కు దమ్ముంటే రెండేండ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
శనివారం సికింద్రాబాద్లో బీజేపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనాన్ని పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో బండి సంజయ్ మాట్లాడుతూ..ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరిగే అవకాశముందని, ఈ నెల 28లోపు షెడ్యూల్ వెలువడే అవకాశముందని చర్చ జరుగుతున్నదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుది లక్కీ హ్యాండ్ అని,ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లేదని, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలిచినా మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తారన్నారు.
ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి కూడా చూపడం లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్లాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందనే సర్వేలు చెబుతున్నాయని, కానీ డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్కు 10, 12 సీట్లు వచ్చినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సహకారంతో మేయర్ సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్నదన్నారు. అదే సమయంలో ఆ పార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయని వ్యాఖ్యానించారు.
పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే: రాంచందర్ రావు
రాష్ట్రంలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండబోతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వబోతున్నదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు.
సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు వెయ్యి స్థానాల్లో గెలిచామని, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు. త్రివేండ్రంపై బీజేపీ జెండా ఎగురవేశామని, తొలిసారి ముంబై కార్పొరేషన్ను కైవసం చేసుకున్నామని, 2028లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని, ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆందోళనకు మద్దతు: కిషన్రెడ్డి
సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. జంట నగరాల్లో ఎన్నో ఏండ్లుగా అన్నింటికీ సికింద్రాబాద్ కేంద్రంగా ఉందని, అలాంటి సికింద్రాబాద్ పేరు లేకుండా.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం సరికాదన్నారు.
ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ దిగజారి మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఏఆర్ రెహ్మాన్ను ఎప్పటికీ ఓ కళాకారుడిగానే చూస్తారని తెలిపారు.
