
ప్రధాని మోడీ ముందు చూపు వల్ల దేశ ప్రజలందరం రక్షింపబడ్డామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు బండి సంజయ్. మే -3 వరకు ప్రధాని కోరిక మేరకు లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని బీజేపీ కోరుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి మార్కజ్ ప్రార్ధనలే కారణంమన్నారు. రేషన్ అందరికీ అందడం లేదని.. దీనికి ప్రభుత్వం , అధికారులు సమాధానం చెప్పాలని తెలిపారు.
అంబేద్కర్ దేశ ప్రజలకు స్ఫూర్తి దాత
కరోనా క్రమంలో స్వీయ గృహ నిర్బంధంలో మహనీయుడు అంబేద్కర్ జన్మదినం చేసుకుంటున్నామని..పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. బీజేపీ నినాదం, విధానం అన్ని కూడా బాబా సాహెబ్ ఆలోచనకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. అంబెడ్కర్ ఆలోచనా విధానాల్లో భాగంగా మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని.. 370 ఆర్టికల్ రద్దు దానిలో భాగమేనన్నారు.
రాబోయే రోజుల్లో కామన్ సివిల్ కోడ్ విధానం పట్ల కేంద్రం ఆలోచిస్తుందని..అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమాణిస్తే, బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తే, భారతీయ జనతా పార్టీ వారి అభ్యున్నతికి పాటు పడుతుందని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.