పోడు రైతులకిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి

పోడు రైతులకిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి

ఈ నెల 15 నుంచి  నిర్వహించే   రెవెన్యూ సదస్సుల్లో  పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని  సీఎం కేసీఆర్ కు  బీజేపీ రాష్ట్ర   అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. గిరిజనులకు పట్టాలు ఇస్తామన్న హామీలను  నిలుపుకోవాలని కోరారు. పోడు భూములకు పట్టాలపై తాము చేసిన  పోరాటాల వల్లే   ప్రభుత్వం 2021 నవంబర్ లో  గిరిజనుల నుంచి  దరఖాస్తులు స్వీకరించిందని   చెప్పారు. అయితే ఇప్పటికే   సమస్యలకు పూర్తి  పరిష్కారం లభించలేదన్నారు. 2018 నవంబర్  23న   మహబూబాబాద్ బహిరంగ సభలో  అవసరమైతే కుర్చీలు  వేసుకొని మరీ పోడు రైతులకు  పట్టాలు ఇస్తామన్న  కేసీఆర్ హామీని  సంజయ్ గుర్తు చేశారు. పట్టాలు ఇస్తామంటే, కుర్చీలు  ఏర్పాటు చేయడానికి  బీజేపీ, గిరిజనులు  సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోడు భూములకు   పట్టాలు ఇవ్వడానికి  వీలుగా రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులతో పాటు ఫారెస్ట్  అధికారులను  భాగస్వామ్యం చేయాలని సూచించారు.