
హైదరాబాద్, కరీంనగర్, వెలుగు: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ హైదరాబాద్ ఆగమైతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. గవర్నర్ తమిళిసై.. నిమ్స్ ఆస్పత్రిని సందర్శిస్తే.. సీఎం మాత్రం ఇంటి గడప కూడా దాటలేదని విమర్శించారు. జర్నలిస్టు మనోజ్ కు సైతం సరైన ట్రీట్ మెంట్ అందించలేదని, అతని ఫ్యామిలీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రం వస్తే ఇస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ హామీ అమలు చేయకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు దుబాయ్ బాట పట్టారు. సీఎం పేరే దుబాయ్ చంద్రశేఖర్. అలాంటి వ్యక్తికి ఎందుకు గౌరవం ఇయ్యాలే”అని సంజయ్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తే.. రాష్ట్రంలో తక్కువ టెస్టులు చేయడం ఏమిటని నిలదీశారు. కరోనా కేసులు ఎక్కువైతే రాష్ట్రం పరువుపోతుందని ప్రజల్ని బలి చేస్తారా? అని ప్రశ్నించారు. కరోనా టెస్టులపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని.. ఇతర రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువ చేయడంతో మరణాల సంఖ్య తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సీఎం వెంట తాను ఢిల్లీకి వస్తానని, కేంద్ర మంత్రులతో మాట్లాడి రావల్సిన నిధులు తెచ్చుకుందామని అన్నారు.
హౌస్ అరెస్టులను ఖండించిన సంజయ్
నేతల హౌస్ అరెస్టులను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కలిసి ప్రజా సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తే.. వారిని హౌస్ అరెస్టు చేయించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని అన్నారు. కేసీఆర్ తీరును ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ నేతలను అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని, ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. కరోనాపై మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తమ పార్టీ ఎత్తి చూపుతోందని, ఇది ప్రజల ప్రాణాలను కాపాడటానికేనని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్లో కూడా మీడియాతో మాట్లాడారు.
గంగుల బండారం బయటపెడ్త
“సంజయ్ ని తిడితే లీడర్ అయితా అనుకుంటున్నావేమో. నీ వీడియో క్లిప్పింగులు.. చాటింగ్ లు అన్ని బయట పెడ్త. సీఎంకే అందిస్త. సమయం కోసం ఆలోచిస్తున్నా. సీఎం ఇవన్నీ చూసి ఛీ.. అంటే నీ మంత్రి పదవి పోవుడు.. జైలుకు పోవుడు ఖాయం” అని మంత్రి గంగుల కమలాకర్ పై సంజయ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి లెటర్ ప్యాడ్లు బినామీ కాంట్రాక్టర్లు.. జీరో దందాల కోసం వాడుతున్నారని ఆరోపించారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెబుతున్నారని.. పంట నష్టం వాటిల్లితే సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాలు తిరిగానని.. మంత్రి ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు. రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు వెళ్లానని.. వారికి కావల్సిన పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు అందించానన్నారు. తాము ప్రజల గుండెల్లో ఉంటామని, ఫొటోల ఫోజుల కోసం.. పేపర్ల న్యూస్ ల కోసం పనిచేయబోమని చెప్పారు.