- భూపాలపల్లి దవాఖానలో నిలిచిపోయిన కరెంట్ సప్లై
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి కాపర్ వైర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కరెంట్ సప్లై లేక దవాఖానలో సీటీ స్కాన్, ఎక్స్రే సేవలు బంద్ అయ్యాయి. హాస్పిటల్ ఆవరణంలోని సీటీ స్కాన్ మెషీన్ రూమ్ వెనక ఏర్పాటు చేసిన రెండు ఎర్తింగ్ పాయింట్ల వద్ద ఉండే కాపర్ వైర్ ను దొంగలు కట్ చేసి తీసుకెళ్లడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీటీ స్కాన్ మెషీన్ రూమ్కు కరెంట్ సప్లై నిలిచిపోవడంతో సేవలు బంద్ అయ్యాయి. గతంలోనూ హాస్పిటల్ ఆవరణంలో కాపర్ వైర్ చోరీకి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని విచారించారు.
