బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాల్గో విడత పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ నుంచి కొత్తపేట, చైతన్యపురి డివిజన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నాగోల్కు చేరుకున్న బండి సంజయ్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం చైతన్యపురి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించిన స్ఫూర్తి ప్రదాతలు, సమర యోధుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.