
న్యూఢిల్లీ: బకాయిల్లో 384 మిలియన్ డాలర్ల (రూ.3,300 కోట్ల) ను బంగ్లాదేశ్ గవర్నమెంట్ అదానీ పవర్కు చెల్లించింది. 2017 విద్యుత్ సరఫరా ఒప్పందం కింద ఉన్న బకాయిలను గణనీయంగా తగ్గించుకుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. జూన్లో 437 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం మాటిచ్చింది. ఇందులో 384 మిలియన్ డాలర్లను చెల్లించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న బకాయిలను క్లియర్ చేశామని ఆ దేశం పేర్కొంది. అయినప్పటికీ అదానీ పవర్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు 500 మిలియన్ డాలర్ల (రూ.4,300 కోట్ల) దగ్గర ఉన్నాయి.
2022లో రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం, తర్వాత దిగుమతి ఖర్చులు పెరగడం, దేశీయ రాజకీయ అల్లకల్లోలంతో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం వల్ల బంగ్లాదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనివల్ల 2017 ఒప్పందం కింద చెల్లింపులు చేయడం కష్టమైంది. బకాయిలు చెల్లించకపోవడంతో అదానీ పవర్ గత ఏడాది ఈ దేశానికి విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించింది. కానీ బంగ్లాదేశ్ నెలవారీ చెల్లింపులు ప్రారంభించిన తర్వాత మార్చి 2025 నుంచి పూర్తి సరఫరా (సుమారు 1,600 మెగావాట్లను) పునరుద్ధరించింది.
తాజా చెల్లింపులతో కలిసి చెల్లించాల్సిన మొత్తం 2 బిలియన్ డాలర్ల బిల్లో సుమారు 1.5 బిలియన్ డాలర్లను బంగ్లాదేశ్ చెల్లించింది. బంగ్లాదేశ్ తన చెల్లింపు కట్టుబాట్లను కొనసాగిస్తే, జనవరి-–జూన్ కాలానికి సుమారు 20 మిలియన్ డాలర్ల విలువైన లేట్ పేమెంట్ సర్ఛార్జ్ను మాఫీ చేస్తామని అదానీ గ్రూప్ పేర్కొంది.