హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) నికర లాభం డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో రూ. 1,870 కోట్లకు పెరిగింది. 2022 డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.1,151 కోట్లతో పోలిస్తే ఇది 62 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో బ్యాంక్ నికర లాభం రూ.4,897 కోట్లుగా రికార్డయ్యింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం రూ.2,672 కోట్ల నుంచి 80 శాతం వృద్ధి చెందింది. బీఓఐ గ్రాస్ ఎన్పీఏల రేషియో క్యూ3 లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 7.66 శాతం నుంచి 5.35 శాతానికి మెరుగుపడింది.
బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం క్యూ3 లో 9.60 శాతం పెరిగిందని, గ్లోబల్ డిపాజిట్లు 8.28 శాతం, అడ్వాన్స్లు (ఇచ్చిన అప్పులు) 11.29 శాతం పెరిగాయని బీఓఐ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. డొమెస్టిక్గా చూస్తే బ్యాంక్ డిపాజిట్లు క్యూ3 లో 7.62 శాతం పెరిగి రూ.5,99,137 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్, అగ్రికల్చరల్, ఎంఎస్ఎంఈ (ఆర్ఏఎం) అడ్వాన్స్లు 13.61 శాతం పెరిగి రూ.2,62,390 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు శుక్రవారం 4 శాతం పెరిగి రూ.151 దగ్గర సెటిలయ్యింది.