టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నయ్.. లోన్లు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు
ఇటీవలే సీఎస్కు లేఖ రాసిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ
లోన్లున్నయో లేవో చూడకుండానే మ్యుటేషన్ చేస్తున్నరని అభ్యంతరం
తొందరగా సమస్యలు పరిష్కరిస్తేనే రైతులకు రుణాలిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పాస్బుక్లు లేకుండా ధరణిలోని వివరాలతోనే పంట రుణాలు తీసుకోవచ్చని సర్కారు చెప్పినా.. అదంత ఈజీ కాదంటున్నాయి బ్యాంకులు. ధరణిలో మస్తు టెక్నికల్ సమస్యలున్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు లోన్లు ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్కుమార్కు ఈనెల 7న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లేఖ రాసింది. ఏ సర్వే నెంబర్లోని భూమికి ఎంత లోనుందో ఎమ్మార్వోలు చూడాలని, లోన్లున్న భూములను ఇంకొళ్లకు అమ్మి మ్యుటేషన్లు చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. దానికి తగ్గట్టే ధరణి వెబ్సైట్ను మార్చాలంది. బ్యాంకుల్లో లోన్లున్నాయో లేదో చూడకుండానే కుటుంబ సభ్యుల పేర్లమీద సబ్ సర్వే నెంబర్లతో మ్యుటేషన్లు చేస్తున్నారని, ధరణిలో ఎమ్మార్వో లాగిన్లోనూ లోన్ వివరాలు కనిపించట్లేదని చెప్పింది. అవేవీ చూడకుండానే మ్యుటేషన్లు చేస్తే ఆ భూముల మీద తీసుకున్న రుణాలు బకాయిలుగా మిగిలిపోయే ప్రమాదముందని పేర్కొంది. పాత పాస్బుక్కుల్లో బ్యాంకు లోన్లు తీసుకున్నట్టు చూపించే రికార్డు ఉండేదని, ధరణి పోర్టల్లోనూ అలాంటి రికార్డును పెట్టాలని లేఖలో బ్యాంకర్స్ కమిటీ సూచించింది. ధరణి ఆన్లైన్ కావడం వల్ల డీసీసీబీల్లో మరిన్ని సమస్యలు వస్తున్నాయని వివరించింది. అసైన్డ్, ఆర్ఓఎఫ్ఆర్భూముల సర్వే నెంబర్లనూ ధరణిలో పెట్టాలని కోరింది. లోన్లపై ఆడిట్ చేసేందుకు పహానీ, ల్యాండ్ రికార్డ్లను ప్రింట్ తీసుకునేందుకు వీలు కల్పించాలని చెప్పింది. వీలైనంత తొందరగా సమస్యలను సాల్వ్ చేస్తేనే రైతులకూ పంట రుణాలు అందుతాయని తేల్చి చెప్పింది.
ఇప్పటిదాకా ఇచ్చిన లోన్లు 24% దాటలె
రాష్ట్రంలో యాసంగి సాగు మొదలై 2 నెలలవుతోంది. పంట రుణాలు మాత్రం 24 శాతం దాటలేదు. వానాకాలం (ఖరీఫ్), యాసంగి (రబీ)కి కలిపి కూడా 70 శాతం దాటలేదు. గత ఖరీఫ్ సీజన్లో రూ.31,936 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, రూ.22,935 కోట్లే ఇచ్చారు. యాసంగిలో 21 లక్షల 74 వేల మంది రైతులకు రూ.21,286 కోట్ల మేర పంట రుణాలిచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, బ్యాంకర్స్ కమిటీ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చింది రూ.5,084 కోట్లే. దాదాపు 5 లక్షల మందికే రుణాలు అందాయి. అందులోనూ కొత్తవి కాకుండా రెన్యువల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా రెండు సీజన్లకు కలిపి పెట్టుకున్న టార్గెట్లో రైతులకు అందిన రుణాలు కేవలం 52.65 శాతమే కావడం గమనార్హం.