
- చిన్న చిన్న అవసరాలకూ లోన్లు
- వెల్లడించిన పైసాబజార్ స్టడీ
న్యూఢిల్లీ : మనదేశంలో బ్యాంకులు జీతం వచ్చే వాళ్లకు అప్పులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్వయం ఉపాధి పొందేవారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైసాబజార్ మూడవ ఎడిషన్ 'మేకింగ్ ఇండియా క్రెడిట్ ఫిట్' రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది. స్వయం ఉపాధి పొందే వారి కంటే జీతభత్యాలు పొందే వినియోగదారుల క్రెడిట్ స్కోర్ బాగుండటమే ఇందుకు కారణం. సర్వేలో పాల్గొన్న వారిలో 25 శాతం మంది శాలరీడ్ ఎంప్లాయీస్ క్రెడిట్స్కోరు 770 , అంతకంటే ఎక్కువ ఉండగా, స్వయం ఉపాధి వినియోగదారులలో బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వారి సంఖ్య 14 శాతం మాత్రమే ఉంది. ఉదాహరణకు, హోం లోన్ల అప్రూవల్ రేటు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు 19 శాతమే ఉంది.
ఇది శాలరీడ్ ఎంప్లాయీలకు 28 శాతంగా ఉంది. క్రెడిట్ హిస్టరీ ఉండని చిన్న వ్యాపారులకు, కూలీలకు లోన్ దొరకడం కష్టమవుతోంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి క్రెడిట్ యాక్సెస్ లేకపోవడం ఒక ముఖ్యమైన అడ్డంకి అని ఎనలిస్టులు చెబుతున్నారు. మొత్తం 3.7 కోట్ల మంది వినియోగదారుల అభిప్రాయాలతో ఈ సర్వే చేశారు. యువ వినియోగదారులలో క్రెడిట్ హెల్త్పై అవగాహన గణనీయంగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ స్కోర్లను చెక్ చేసిన వ్యక్తులలో 14 శాతం మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉండగా, 52 శాతం మంది 30-–40 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది.
మహిళల సంఖ్యే ఎక్కువ..
పురుషుల కంటే మహిళలు హోం లోన్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చాలా బ్యాంకులు మహిళా కొనుగోలుదారులకు తగ్గింపుతో కూడిన హోమ్ లోన్ రేట్లను అందిస్తాయి. అందుకే వారి పేరిట లోన్లు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రాష్ట్రాలు మహిళల పేరు మీద నమోదైన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ రేట్లను తగ్గిస్తాయి. ఇదిలా ఉంటే, వివిధ అవసరాలకు చిన్న వయస్సు నుంచే క్రెడిట్ను ఉపయోగిస్తున్నారు. 64 శాతం మంది వినియోగదారులు 30 ఏళ్లు నిండకముందే వారి మొదటి లోన్ తీసుకున్నారు. వీరిలో 37 శాతం మంది 25 ఏళ్లలోపు వారు ఉన్నారు. యువకులు టూవీలర్ లోన్లు, క్రెడిట్ కార్డ్ల పట్ల మొగ్గు చూపుతున్నారు. కెరీర్లు పెరుగుతున్న కొద్దీ కన్జూమర్ డ్యూరబుల్స్, హోం లోన్లు వంటి పెద్ద లోన్లను తీసుకుంటున్నారు. ఇంతకు ముందు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఇండ్ల కొనుగోళ్లు మొదలైన అత్యవసర సమయాల్లో మాత్రమే లోన్ తీసుకునేవారు. ఇప్పుడు సాధారణ అవసరాలకు కూడా బ్యాంకుల గడప తొక్కుతున్నారని ఈ స్టడీ తెలిపింది.