వరంగల్, పర్వతగిరి (సంగెం), వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ సెకండియర్ స్టూడెంట్ శాబోతు సంజయ్ కిరణ్ (19) జీర్ణకోశ వ్యాధితో మరణించాడు. మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్రంగంపేటకు చెందిన సంజయ్ నిరుడు బాసర ట్రిపుల్ఐటీలో సీటు పొందాడు. హాస్టల్ లో ఫుడ్ మంచిగ లేదంటూ పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో రెండు నెలలుగా జీర్ణకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పేరెంట్స్ అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మందులు వాడుతున్న క్రమంలో సంజయ్ 15 రోజుల కింద అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తో పాటు ఎంజీఎంలో కూడా వైద్యం చేయించారు. ఎంజీఎంలో ట్రీట్ మెంట్ పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. కుటుంబ సభ్యులు సంజయ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎల్గూర్ రంగంపేటకు తరలించారు.
పాంక్రియాస్ సమస్యతో బాధపడుతున్నడు: ఆఫీసర్లు
సంజయ్ కిరణ్ పాంక్రియాస్ సమస్యతో బాధపడుతున్నాడని బాసర ఆర్జీయూకేటీ వర్సిటీ ఆఫీసర్లు అన్నారు. దాని కారణంగానే ఆ విద్యార్థి అనారోగ్యం పాలై, గత నెల 20న క్యాంపస్ నుంచి సొంతూరుకు వెళ్లాడని చెప్పారు. అందు కోసం అతని పేరెంట్స్ అనుమతితో సంజయ్కు ఔట్పాస్ కూడా జారీ చేశామని తెలిపారు.
16 లక్షలు ఖర్చుపెట్టినా బతకలేదు
బాసర ట్రిపుల్ఐటీలో స్టూడెంట్లకు పెట్టే ఆహారం సరిగా లేకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సంజయ్తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్టల్లో అన్నం, కూరలు బాగా లేవని తమ కుమారుడు తమకు తరచూ చెప్పేవాడని తెలిపారు. అంతకు ముందు ఇంటి వద్ద ఉన్నప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉందని, రెండు నెలలుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో రూ.16 లక్షల వరకు ఖర్చు పెట్టామని, అయినా తమ కొడుకును బతికించుకోలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకులాంటి పరిస్థితి ఇతర స్టూడెంట్లకు రాకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంజయ్మృతి వార్త తెలుసుకున్న ట్రిపుల్ఐటీ విద్యార్థులు, ఆఫీసర్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇటీవలే వర్సిటీ హాస్టల్లో కలుషిత ఆహారం కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టారు.