
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ స్కాంలో కవిత పేరును ప్రస్తావిస్తూ.. అది తెలంగాణకు అవమానం అని మాట్లాడటం సరికాదన్నారు. కొందరు నేతలు తెలంగాణ ప్రజలను, వాళ్ల భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అవి మానుకుంటే మంచిదని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో దేశానికి మాయని మచ్చ తీసుకొచ్చారని, ఆ స్కాంలో ఇరుకున్న వాళ్లంతా ఢిల్లీ ప్రజలకే కాదు మొత్తం దేశానికి సమాధానం చెప్పాలని అన్నారు.
కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్లు ఎలా అవుతుందని, విచారణను ఎదుర్కోవల్సింది పోయి తెలంగాణ కు అవమానం జరిగింది అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లపై మండిపడ్డారు. లిక్కర్ స్కాంతో తెలంగాణ సెంటిమెంట్ కు ఏ సంబంధం లేదని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని తెలిపారు. ఏ పార్టీ చేయని లిక్కర్ అవినీతి కేజ్రీవాల్ సర్కారు చేసిందని అన్నారు. అవినీతి చేసింది ఎంత పెద్దవాళ్లైనా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని, లిక్కర్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టొద్దని సూచించారు. దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేపట్టాలని వెల్లడించారు.