స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు
  • గత 3 ఎన్నికల వివరాలు ఇవ్వాలని పీఆర్​కు ఆదేశం 
  • రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్టులు అందజేయనున్న అధికారులు 
  • ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పర్యటించిన కమిషన్
  • త్వరలో ఏపీ, బిహార్​కు వెళ్లి అధ్యయనం 
  • ఎన్నికల కోడ్ తర్వాత కులగణన.. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం 
  • స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించిన గత సర్కార్ 
  • ఎన్నికల హామీ మేరకు కులగణనకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్ లెక్కల ద్వారా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అందుకు తగ్గట్టు కమిషన్ చైర్మన్, మెంబర్లు పనిచేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో గత 3 లోకల్ బాడీస్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్ట్ తదితర వివరాలు అందజేయాలని ఇటీవల పంచాయతీ రాజ్ శాఖను బీసీ కమిషన్ ఆదేశించింది.

దీంతో ఈ వివరాలు అందచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ చైర్మన్, మెంబర్లు కర్నాటక, తమిళనాడుతో పాటు మరో రాష్ర్టంలో పర్యటించారు. ఈ మూడు రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు, బీసీల జనాభా, రిజర్వేషన్లు కల్పించిన తీరుపై సమగ్ర నివేదిక తయారు చేశారు. త్వరలో ఏపీ, బిహార్ లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, బీసీ కమిషన్ కు సిబ్బంది కొరత ఉండటం

కమిషన్ కూడా పంచాయతీరాజ్ తో పాటు ప్రభుత్వ శాఖల సహాకారంతోనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున సర్కారు గ్రీన్ సిగ్నల్ కోసం కమిషన్ చైర్మన్, మెంబర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోడ్ ముగిశాక కులగణన కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది.  

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు 

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. జూన్​లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ల లెక్క తేలకపోవటంతో ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని ఇందుకు రూ. 150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే పూర్తి చేసింది. ఇపుడు అలాగే చేసే అవకాశం ఉన్నా.. కులగణనకు ముందు జరగాల్సిన ప్రాసెస్ కు నెల రోజుల టైమ్ పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణనకు నోడల్ ఏజెన్సీ ఎంపిక, జిల్లా కలెక్టర్లతో మీటింగ్, కులగణన ఎలా చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రాసెస్ కు నెల రోజుల టైం పడుతుందని భావిస్తున్నారు.  

బీసీ కోటాను తగ్గించిన గత సర్కార్ 

సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాలు ఆర్టికల్ 243 ప్రకారం బీసీ కులాల లెక్కలను తయారు చేశాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి కసరత్తు చేపట్టలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ను సాకుగా చూపి1994 నుంచి అమలు చేస్తున్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి అమలు చేశారు. ఫలితంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు వెయ్యికి పైగా సర్పంచ్ స్థానాలను..

వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో10 శాతం సీట్లను కోల్పోయారు. గ్రేటర్ హైరాబాద్ తో సహా మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కాయి. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉండటం వల్ల 50% సీలింగ్ కు లోబడి బీసీ కోటాను 34% అమలు చేశారు. అయితే, స్థానిక ఎన్నికల్లో బీసీల కోటాను తగ్గించడంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీసీ సంఘాలు, ఆ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఈ తప్పు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేలా కులగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే బీసీ రిజర్వేషన్లు..  

స్థానిక సంస్థల(పంచాయతీలు, మున్సిపాలిటీలు)లో ట్రిపుల్ టెస్ట్ ద్వారా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించిన తర్వాతే అమలు చేయాలని 2010లో  కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో తప్పనిసరిగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా.. మొదట బీసీల వెనుకబాటుకు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా ఆమోదయోగ్యమైన లెక్కలు తీయాలి. తర్వాత ఆ లెక్కల ద్వారా బీసీ కోటాను నిర్ధారించాలి.

ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతం సీలింగ్ దాటకుండా చూడాలి” అని సుప్రీంకోర్టు వివరించింది. అయితే, ఇటీవల ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అమలు చేయడంలేదనే కారణంగా ఆ రాష్ట్ర హైకోర్టు బీసీ కోటా లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికలను పూర్వ పద్ధతిలోనే ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.