- కరీంనగర్, హనుమకొండ సీపీలకు నోటీసులు
హనుమకొండ, వెలుగు: హుజూరాబాద్ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో నలుగురిని అరెస్టు చేయడంపై నేషనల్ బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది. అరెస్టుపై ఐదు పని దినాల్లో నివేదిక సమర్పించాలని కరీంనగర్, వరంగల్ సీపీలకు నోటీసులు ఇచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఓ ప్రజాప్రతినిధిపై తప్పుడు పోస్టులు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారనే కారణంతో ఈ నెల 17న కమలాపూర్ మండలానికి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండారి సదానందం, వడ్డే రమేశ్, కారట్లపల్లి వసంత్ రావు, కడారి వెంకటేశ్ అనే నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వసంత్ తండ్రి కారట్లపల్లి దశరథం పోలీసుల తీరుపై నేషనల్ బీసీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సీరియస్ గా తీసుకున్న కమిషన్ సోమవారం సాయంత్రం కరీంనగర్, వరంగల్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. నివేదిక సమర్పించకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసులు ఇష్యూ చేసిన అనంతరం నలుగురిని బెయిల్ పై విడుదల చేయడం గమనార్హం.