ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్

ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​కు బీసీ సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  కు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. త్వరలో విస్తరించనున్న మంత్రివర్గంలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని, ప్రస్తుత మంత్రివర్గంలోనూ బీసీలకు ప్రాధాన్యత గల శాఖలు కేటాయించాలని, పార్టీ పరమైన పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  గురువారం గాంధీ భవన్ లో బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, అయిలి వెంకన్న, శేఖర్, శ్యాం, సింగం నగేష్, సంపత్ ఇతర నేతలు పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో బడుగులకు న్యాయం చేసే దిశగా పీసీసీ చీఫ్ కృషి చేస్తున్నారని, కులగణన జరగడంలో, ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు న్యాయం జరగడంలో ఆయన కృషి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమన్వయం చేస్తూ బడుగులకు న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

మున్నూరు కాపు, గొల్ల, కురుమ నేతలకూ అవకాశమివ్వాలి 

మంత్రివర్గ విస్తరణలో, పార్టీ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలని గురువారం మహేశ్ కుమార్ గౌడ్ ను మున్నూరు కాపు, గొల్ల, కుర్మ సంఘాల నేతలు గాంధీ భవన్‌‌లో వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. విప్ ఆది శ్రీనివాస్ కు మున్నూరు కాపు సంఘం నుంచి కేబినెట్​లో చాన్స్​ఇవ్వాలని కోరారు. విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో గొల్ల కురమ సంఘం నాయకులు గాంధీ భవన్ కు వచ్చి తమకూ మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయా సామాజికవర్గాలకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురమలు లేని ప్రభుత్వం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగినా.. గొల్ల కురమలకు అన్యాయం జరిగిందన్నారు.