బీసీ నేతల రహస్య మీటింగ్..బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు హాజరు​

బీసీ నేతల రహస్య మీటింగ్..బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు హాజరు​
  • బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నేతలు హాజరు
  • జాజుల శ్రీనివాస్​ గౌడ్​ నేతృత్వంలో గెట్​ టు గెదర్​

హైదరాబాద్, వెలుగు: వివిధ పార్టీల్లోని బీసీ నేతలు శుక్రవారం రహస్యంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే టికెట్​ ఆశావహులు సహా 200 మంది నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ నేతృత్వంలో శామీర్​పేట్​లోని ఓ రిసార్ట్స్​లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన పలువురు బీసీ నేతలు ఈ మీటింగ్​కు హాజరై తమ అసంతృప్తి గళాలను వినిపించినట్లు తెలిసింది. పార్టీలో టికెట్​ దక్కకుంటే ఏం చేయాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం. ‘మేమెంతో మాకంత’ అన్న నినాదాన్నే ఎన్నికల్లో వినిపించాలని డిసైడ్​ అయ్యారు. 

ఈ క్రమంలో రాజకీయ వాటా దక్కించుకోవాల్సిందేనని మీటింగ్​లో బీసీ నేతలు తీర్మానించినట్టు తెలిసింది. గెలుపు గుర్రాలంటూ రెడ్లు, వెలమలకు టికెట్లు ఎక్కువ కేటాయించొద్దన్న డిమాండ్​నూ వినిపించినట్టు సమాచారం.  కాగా, బీసీల జనాభా దాదాపు 60% ఉన్న నేపథ్యంలో 60 సీట్లు సాధించాల్సిందేనని బీసీ నేతలు సమావేశంలో తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో కనీసం 3 స్థానాలను సాధించుకుకోవాలని నేతలు నిర్ణయించినట్టు సమాచారం. బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు పార్టీల రాష్ట్రాధ్యక్షులతో భేటీ నిర్వహించాలని నేతలు తీర్మానించారని తెలిసింది.