
న్యూఢిల్లీ: బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురిసింది. స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసార హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్18.. దాదాపు రూ. 6 వేల కోట్లకు దక్కించుకుంది. వచ్చే ఐదేళ్ల(2023–2028)కు సంబంధించి డిజిటల్ (జియో సినిమా)కు రూ. 3101 కోట్లు, టీవీ (స్పోర్ట్స్ 18)కి రూ. 2862 కోట్లు బిడ్ చేసింది. హోరాహోరీగా సాగిన ఈ–వేలంలో సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి వయాకామ్కు గట్టి పోటీ ఎదురైంది.
రాబోయే ఐదేళ్లలో మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా 88 ద్వైపాక్షిక మ్యాచ్లు (102కు పెరిగే చాన్స్ ఉంది) ఆడనుంది. ఇందులో 25 టెస్ట్లు, 27 వన్డేలు, 36 టీ20లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్కు వయాకామ్ రూ. 67.76 కోట్లు చెల్లించనుంది. రాబోయే ఐదేళ్లలో ఇండియా.. ఆస్ట్రేలియాతో 21, ఇంగ్లండ్తో 18, న్యూజిలాండ్తో 11, సౌతాఫ్రికాతో 10, వెస్టిండీస్తో 10, అఫ్గానిస్తాన్తో 7, శ్రీలంకతో 6, బంగ్లాదేశ్తో 5 మ్యాచ్లు ఆడనుంది.