న్యూఢిల్లీ : ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకే అతి పెద్ద వాటా దక్కనుంది. గురువారం జరిగిన ఐసీసీ బోర్డు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కొత్త రెవెన్యూ పంపిణీ విధానానికి అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దీంతో కొత్త రెవెన్యూ మోడల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీకి 600 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది. కొత్త మోడల్ ప్రకారం బీసీసీఐకి ఎంత ఆదాయం లభిస్తుందన్న దానిపై ఐసీసీ క్లారిటీ ఇవ్వకపోయినా ఇండియన్ బోర్డు వాటా 230 మిలియన్ డాలర్లు (రూ. 1887 కోట్లు)గా ఉండే అవకాశం ఉంది.
మొత్తం ఆదాయంలో ఇది 38.4 శాతంగా ఉంది. ఇంగ్లండ్ బోర్డుకు 41 మిలియన్ డాలర్లు (6.89 శాతం), ఆస్ట్రేలియాకు 37.5 మిలియన్ డాలర్లు (6.25 శాతం) చెల్లించనున్నారు. వరల్డ్ వైడ్గా కొత్త టీ20 లీగ్లు ఎక్కువగా వస్తుండటంతో తుది జట్టులో విదేశీ ప్లేయర్ల సంఖ్యను నలుగురికే పరిమితం చేసింది. స్లో ఓవర్ రేట్ జరిమానాను కూడా ఐసీసీ సవరించింది. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో నుంచి ప్రతి ఓవర్కు 5 నుంచి 50 శాతం వరకు కోత విధించనుంది.
ఏ జట్టు అయినా 80 ఓవర్ల కంటే ముందే ఆలౌటైతే ఓవర్ రేట్ పెనాల్టీ వర్తించదు. ఇక ఐసీసీ ఈవెంట్స్లో పాల్గొనే మెన్స్, విమెన్స్ టీమ్స్కు సమాన ప్రైజ్మనీ ఇవ్వనున్నారు.