- చేనేత రంగాన్ని అవినీతిమయం చేసిన్రు
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. చేనేత రంగాన్ని అవినీతితో అస్థవ్యస్తం చేసి ఇప్పుడు నేతన్నల పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి చేకూరలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాల్లో, 105 సంఘాలకే పని కల్పించారని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫాం సరఫరా కోసం నూలు కొనుగోలు చేసేందుకు రూ.47 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలు రూ.8.81 కోట్లు కూడా విడుదల చేశామని, త్వరలో మరో రూ.7 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు.
చేనేత గురించి గొప్పలు చెప్పుకుంటున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 నవంబర్ వరకు టెస్కోకు రావాల్సిన రూ.488.38 కోట్ల బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. గతేడాది బతుకమ్మ చీరల కింద టెస్కోకు చెల్లించాల్సిన రూ.351.52 కోట్లను కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే జాలేస్తుందన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు, హ్యాండ్ లూమ్ పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్ లూమ్, కొత్త మెక్రో హ్యాండ్ లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ ఏర్పాటుకు, స్టేట్ టెక్నికల్ టైక్స్టైల్ పాలసీ రూపొందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తుమ్మల వివరించారు.
