యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో ఆదివారం 'సామూహిక గిరిప్రదక్షిణ' నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు భక్తులతో కలిసి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి , గిరిప్రదక్షిణ ఆరంభించారు. అనంతరం కొండపైకి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గిరిప్రదక్షిణ కార్యక్రమంలో 12 ఏళ్ల చిన్నారి చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
హైదరాబాద్ కు చెందిన 12 ఏళ్ల వైష్ణోదేవి.. యాదగిరిగుట్టలో కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర ఉన్న గిరిప్రదక్షిణ మార్గంలో కూచిపూడి నాట్యం చేసింది. చిన్నారిని ఎమ్మెల్యే అయిలయ్య, ఆలయ ఈవో భవానీ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్ సన్మానించి అభినందించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని నిర్వహించారు.
