కేసీఆర్ మాట నమ్మి… సన్న రకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారు

కేసీఆర్ మాట నమ్మి… సన్న రకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  తాను చెప్పిన పంటనే సాగు చేయాలంటూ రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని… అగాథంలోకి నెట్టేస్తున్నారని.. ప్రభుత్వం మక్కల కొనుగోలు విషయంలో గందరగోళానికి  గురిచేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలు నిర్వహించకుండా…  నిర్బంధ సాగు విధానం అమలు చేయడం అశాస్త్రీయం కాదా…? ఏ భూమిలో ఏ పంట పండించాలో చెప్పకుండా మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కేసీఆర్ మాత్రం… ఫామ్ హౌజులో ఉండి హుకుం జారీ చేస్తున్నారన్నారు.

గతంలో కేసీఆర్ మాట నమ్మి… సన్న రకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారన్నబండి సంజయ్.. ఇందుకు ఎవరు బాధ్యులన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు లాభాలు గడిస్తుంటే… రైతులు ఎందుకు నష్టపోతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు బండి సంజయ్. ఆందోళనలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడి మాట్లాడితే… కేసీఆర్ కు చిల్లర రాజకీయాల లాగా కనిపిస్తోందా…? కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. కేసీఆర్ లాగా కోట్లు సంపాదించే టెక్నిక్ తెలియకపోవడం వల్ల రైతులు చిల్లర మనుషుల్లా కనిపిస్తున్నారా…? అని ప్రశ్నించారు బండి సంజయ్.