
- సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లు కూడా రికార్డ్ గరిష్టాలకు..
- రూ.2.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- మార్కెట్ మరింత పెరుగుతుందంటున్న ఎనలిస్టులు
బిజినెస్ డెస్క్, వెలుగు: గత కొన్ని సెషన్లుగా ఊరిస్తున్న 19,000 లెవెల్ను బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ బుధవారం సెషన్లో అందుకుంది. ఇంట్రాడేలో ఈ లెవెల్ను క్రాస్ చేసి 19, 011.25 వద్ద సరికొత్త ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారిన సెషన్లో సెన్సెక్స్ 499 పాయింట్లు ఎగిసి 63,915 వద్ద సరికొత్త క్లోజింగ్ రికార్డ్ను నమోదు చేసింది.
ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 64,050.44 టచ్ చేసి ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. నిఫ్టీ 155 పాయింట్లు లాభపడి 18,972 వద్ద సెటిలయ్యింది. డైలీ చార్ట్లో బుల్లిష్ క్యాండిల్ను ఈ ఇండెక్స్ ఏర్పరిచిందని, రానున్న సెషన్లలో కూడా ఈ ఇండెక్స్ పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 19,100–19,200 వరకు వెళుతుందని అంచనావేస్తున్నారు. ఈ లెవెల్స్ను దాటాక కరెక్షన్ రావొచ్చని, 18,800–18,700 వద్ద సపోర్ట్ ఉందని పేర్కొన్నారు. గత మూడు సెషన్లుగా మార్కెట్ పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.43 లక్షల కోట్లు పెరిగింది. ఒక్క బుధవారం సెషన్లోనే రూ.2.22 లక్షల కోట్లు పెరిగింది. వర్షాకాలం ప్రారంభమవ్వడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మెర్జర్ జులై 1 నుంచి అమల్లోకి రానుండడంతో మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ కనిపించింది.
మార్కెట్ పెరగడానికి గల కారణాలు..
1. ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ...
నిఫ్టీ బ్రేక్ అవుట్ అవ్వడంతో షార్ట్ పొజిషన్లు ఎగ్జిట్ అయ్యాయని ఎనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్ పెరగడంలో ఇదొక కారణమని అన్నారు. అంతేకాకుండా జులై సిరీస్ కోసం లాంగ్ కాంట్రాక్ట్ల రోల్ ఓవర్ (కొత్త సిరీస్లో పొజిషన్లు కొనడం) జరిగిందని, ఇది గత మూడు నెలల యావరేజ్ కంటే ఎక్కువని అన్నారు. నిఫ్టీ 50 లో రోలోవర్స్ ఎక్కువగా ఉన్నాయని, కానీ నిఫ్టీ బ్యాంక్లో ఇవి తక్కువగా ఉన్నాయని చెప్పారు. నిఫ్టీ బ్యాంక్ కూడా ఇంట్రాడేలో 44,508 దగ్గర కొత్త రికార్డ్లను టచ్ చేసినప్పటికీ, చివరికి 0.5 శాతం లాభంతో 44,328 వద్ద ముగిసింది.
2. వర్షాల వరజల్లు..
ఈ నెల మొదటి 15 రోజుల్లో యావరేజ్ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కానీ, చివరి 15 రోజుల్లో వర్షాలు యావరేజ్ స్థాయి కంటే ఎక్కువగా పడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ కంపెనీల ఎర్నింగ్స్ బాగుండడంతో పాటు, దేశం మొత్తం మీద వర్షాలు పడుతుండడం మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయని ఎడెల్వీస్ ఎంఎఫ్ సీఐఓ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య అన్నారు.
3. రిలయన్స్, ఇన్ఫోసిస్ ఊపు..
నిఫ్టీ 19 వేల లెవెల్ను క్రాస్ చేయడంలో ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ కీలక పాత్ర పోషించాయి. రిలయన్స్ షేర్లు బుధవారం 1.3 శాతం పెరిగి రూ.2,530 కి చేరుకోగా, ఇన్ఫోసిస్ ఒక శాతం లాభపడి రూ. 1,293 లెవెల్ను టచ్ చేసింది. సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, మెటల్స్, కన్జూమర్ డిస్క్రిషనరీ షేర్లులు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
4. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు..
తాజా మార్కెట్ ర్యాలీని విదేశీ ఇన్వెస్టర్లే నడిపారని చెప్పాలి. దేశ ఎకానమీ బలంగా ఉండడంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో జూన్ నెలలో ఏకంగా 3 బిలియన్ డాలర్ల (రూ.24,600 కోట్ల) ను ఇన్వెస్ట్ చేశారు. గత నాలుగు నెలల్లో 11 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. 2020 లో ఎఫ్ఐఐలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఇది సగానికి సమానం.
5. గ్లోబల్ మార్కెట్లు..
యూఎస్లో ఎకానమీ మెరుగుపడుతుండడం, చైనా కొత్త స్టిమ్యులస్ ప్యాకేజిని ప్రకటిస్తుందన్న అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కదిలాయి. ఫ్రాన్స్ సీఏసీ 40, జర్మనీ డాక్స్, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్లు 0.7 శాతం వరకు లాభపడ్డాయి. జపాన్ నికాయ్ 2 శాతం పెరగగా, సౌత్కొరియా కొస్పీ 0.7 శాతం పడింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఓపెనింగ్ సెషన్ నష్టాలను తగ్గించుకుంది. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.
మన మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది..
ఇండియన్ ఈక్విటీ మార్కెట్ వాల్యూ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 13.77 శాతం పెరిగింది. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 లో ఉన్న మార్కెట్లలో ఇండియానే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్ 3.48 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో ఐదో ప్లేస్లో ఉంది. 45.90 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న యూఎస్ మార్కెట్ వాల్యూ జూన్ క్వార్టర్లో 6.38 శాతం పెరిగింది. 10.02 ట్రిలియన్ మార్కెట్ క్యాప్తో రెండో ప్లేస్లో ఉన్న చైనా మార్కెట్, ఈ జూన్ క్వార్టర్లో 8.46 శాతం పెరిగింది. జపాన్ మార్కెట్ క్యాప్ వాల్యూ 3.11 శాతం పెరిగింది. హాంకాంగ్ 5.19 శాతం, ఫ్రాన్స్ 1.69 శాతం పెరిగాయి.
చాలా సార్లు ప్రయత్నించాక, డొమెస్టిక్ మార్కెట్ సక్సెస్ఫుల్గా కొత్త ఆల్ టైమ్ హైలను నమోదు చేయగలిగింది. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ఇది సాధ్యమయ్యింది. విదేశీ ఇన్వెస్టర్ల ఇన్ఫ్లోస్ కొనసాగడం, దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు పెరిగాయి. ఫార్మా, మెటల్ సెక్టార్లు టాప్ పెర్ఫార్మర్లుగా నిలిచాయి.
- వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్