- స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు 5 శాతం వరకు డౌన్
- రూ. 13. 47 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు నిఫ్టీ, సెన్సెక్స్ బుధవారం భారీగా పడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండడంతో మార్కెట్ మూడ్ మారిపోయింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 1,500 పాయింట్లు పడింది. 906 పాయింట్ల (1.23 శాతం) నష్టంతో 72,762 దగ్గర ముగిసింది. నిఫ్టీ 338 పాయింట్లు పడి 21,997 దగ్గర సెటిలయ్యింది.
నిఫ్టీ మిడ్క్యాప్ అయితే ఏకంగా నాలున్నర శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.25 శాతం క్రాష్ అయ్యాయి. ఎన్ఎస్ఈలో బుధవారం 2,692 షేర్లు ట్రేడవ్వగా ఇందులో 2,439 షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. కేవలం 193 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మినహా మిగిలిన సెక్టార్ల ఇండెక్స్లన్నీ నెగెటివ్లో ముగిశాయి. నిఫ్టీ మీడియా, మెటల్, రియల్టీ ఇండెక్స్లు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.
షార్ట్ టెర్మ్లో మార్కెట్ మరింత పడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ను వాడుకోవాలని సలహా ఇచ్చారు. లార్జ్ క్యాప్ షేర్లను కొనుక్కోవాలన్నారు. ఎస్ఎంఈ లిస్టింగ్లో ప్రైస్ మానిప్యులేషన్ జరుగుతోందనే సంకేతాలు ఉన్నాయని సెబీ చైర్మన్ మాధవి పురి బచ్ ప్రకటించిన తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఎస్ఎంఈ ఐపీఓల వాల్యుయేషన్ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఎక్కువ చేసి చూపుతుండగా, ఈ ఇష్యూపై సెబీ దర్యాప్తు జరుపుతోంది.
ఇక బాండ్ మార్కెట్పై ఇన్వెస్టర్ల ఫోకస్..
గ్లోబల్ బాండ్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్లకు చోటు దక్కడంతో భారీగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని సెబీ చైర్మన్ మాధవి పురి బచ్ అంచనా వేశారు. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రైట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ల యూనిట్ సైజ్ను తగ్గిస్తామని చెప్పారు. చిన్న ఇన్వెస్టర్లు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
కాగా, జేపీ మోర్గాన్, బ్లూమ్బర్గ్ తమ గ్లోబల్ ఇండెక్స్లో ఇండియన్ గవర్నమెంట్ బాండ్లకు చోటు కలిపించనున్నాయి. దీంతో దేశంలోని డెట్ మార్కెట్లోకి 40 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ఏడాది జూన్ 28 నుంచి వచ్చే ఏడాది 31 వరకు జేపీ మోర్గాన్ గ్లోబల్ ఇండెక్స్లలో ఇండియన్ బాండ్లకు చోటు దక్కుతుంది.