పడి లేచిన మార్కెట్‌‌ .. ఇంట్రాడే కనిష్టాల నుంచి  300  పాయింట్లు పెరిగిన నిఫ్టీ

పడి లేచిన మార్కెట్‌‌  .. ఇంట్రాడే కనిష్టాల నుంచి  300  పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • కిందకి లాగిన ఐటీ, ఫార్మా షేర్లు
  • సపోర్ట్‌‌గా నిలిచిన  బ్యాంక్‌‌, ఆటో,  ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు

ముంబై: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు  బుధవారం  ఇంట్రాడే నష్టాల నుంచి షార్ప్‌‌గా రికవర్‌‌‌‌ అయ్యాయి. యూఎస్  ఇన్‌‌ఫ్లేషన్ కిందటి నెలలో అంచనాల కంటే ఎక్కువ పెరగడంతో  మార్కెట్‌‌ నష్టాల్లో ఓపెన్ అయ్యింది. మార్నింగ్ సెషన్‌‌లో ఒక శాతం చొప్పున పడిన నిఫ్టీ, సెన్సెక్స్‌‌, చివరికి అర శాతం లాభంతో సెషన్ ముగించాయి. యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ జనవరిలో 3.1 శాతానికి పెరిగింది.

2.9 శాతంగా రికార్డవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. దీంతో  గ్లోబల్‌‌ మార్కెట్‌‌లు బుధవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లు పడడంతో నిఫ్టీ ఇంట్రాడేలో  21,530 వరకు  తగ్గింది.  ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల నుంచి సపోర్ట్ దొరకడంతో 97 పాయింట్ల (0.45 శాతం)  లాభంతో 21,840 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌‌ ఇంట్రాడేలో కనిష్టాల నుంచి 1,000 పాయింట్లు రికవరై 278 పాయింట్ల లాభంతో 71,834 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీలో బీపీసీఎల్‌‌, ఎస్‌‌బీఐ, కోల్‌‌ ఇండియా, ఓఎన్‌‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.

టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్‌‌, డా. రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెక్టార్ల పరంగా చూస్తే  పీఎస్‌‌యూ బ్యాంక్‌‌, ఆయిల్ అండ్ గ్యాస్‌‌ ఇండెక్స్‌‌లు 3 శాతం చొప్పున పెరగగా,  ఆటో, బ్యాంక్‌‌, ఎఫ్‌‌ఎంసీజీ, క్యాపిటల్‌‌ గూడ్స్‌‌, మెటల్, పవర్‌‌‌‌, రియల్టీ ఇండెక్స్‌‌లు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, ఫార్మా ఇండెక్స్‌‌లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్, స్మాల్ క్యాప్‌‌ ఇండెక్స్‌‌లు ఒక శాతం చొప్పున పెరిగాయి. మారుతి సుజుకీ, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఆటో వంటి 200 కి పైగా షేర్లు బుధవారం ఏడాది గరిష్టాన్ని టచ్ చేశాయి. 

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

గ్లోబల్  మార్కెట్‌‌లు బలహీనంగా ఉన్నా  మన మార్కెట్‌‌ లాభాల్లో ముగిసిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మార్కెట్‌‌ కన్సాలిడేట్ అవుతోందని, ఒక వేళ పెరిగితే 22,000 – 22,150 వరకు వెళ్లొచ్చని అంచనా వేశారు. నిఫ్టీకి 21,550 – 21,530 దగ్గర సపోర్ట్ లభిస్తోందని, పైన 22,000–22,020 దగ్గర రెసిస్టెన్స్‌‌ వస్తుందని షేర్‌‌‌‌ఖాన్‌‌ ఎనలిస్ట్‌‌ జతిన్ గేడియా పేర్కొన్నారు. ప్రస్తుతం 21,650–21,670 లెవెల్స్‌‌కు సపోర్ట్‌‌ షిఫ్ట్ అయ్యిందని చెప్పారు. బ్యాంక్ నిఫ్టీకి 200 రోజుల మూవింగ్ యావరేజ్‌‌ (44,900) దగ్గర  సపోర్ట్ దొరికిందని, 46,500 – 46,900 వరకు వెళ్లొచ్చని అంచనా వేశారు. 

మార్కెట్‌‌ స్పెషల్  సెషన్‌‌.. 

వచ్చే నెల 2 (శనివారం) న స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తామని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ) బుధవారం ప్రకటించింది. ఇంట్రాడేలో డిజాస్టర్‌‌‌‌ రికవరీ సైట్‌‌కు ట్రేడింగ్ అంతా షిఫ్ట్ అవుతుందని పేర్కొంది. ఊహించని పరిస్థితుల్లో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఎన్‌‌ఎస్‌‌ఈ సిస్టమ్‌‌ మొత్తాన్ని బలపరుస్తోంది. ఇందులో భాగంగా స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌‌ను నిర్వహించనుంది.  ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌‌ సెగ్మెంట్లలో ట్రేడింగ్ సెషన్ ఉంటుందని ఎన్‌‌ఎస్‌‌ఈ ప్రకటించింది.

ఇంట్రాడేలో ప్రైమరీ సైట్‌‌ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌‌కు  మారడం జరుగుతుందని తెలిపింది. సెషన్ రెండు ఫేజ్‌‌లలో జరగనుంది. మొదటి ఫేజ్‌‌లో ఉదయం 9.15 నుంచి 10 వరకు 45  నిమిషాల సెషన్ ఉంటుంది. రెండో ఫేజ్‌‌ 11.30  నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ప్రీ ఓపెన్ సెషన్లు ఉదయం 9.‌‌‌‌‌‌‌‌00 – 9.08 మధ్య, 11.15–11.23 మధ్య ఉంటాయి. ఈ స్పెషల్ సెషన్‌‌ను కిందటి నెల 20  న  (శనివారం)  జరపాల్సి ఉంది. కానీ, రామ మందిరం ఓపెనింగ్ కారణంగా ఆ రోజు  పూర్తి సెషన్‌‌ను నిర్వహించారు. జనవరి 22 న (సోమవారం)  హాలిడే ఇచ్చారు.