
బెంగళూరు సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న తల్లి, ఇద్దరు చిన్న పిల్లలకు కరోనా వైరస్ సోకిందని.. అక్కడి మున్సిపల్ అధికారులు హోం క్వారంటైన్ పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి ఫ్లాట్ ను రేకుల షీట్లతో సీల్ చేశారు. అంతటితో ఆగకుండా పక్కనున్న మరో ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వృద్ద దంపతుల ఇంటిని రేకుల షీట్లతో సీల్ డౌన్ చేశారు.కరోనా మహామ్మారిని కట్టడి చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు చేసిన ప్రయత్నం ఇది.
అదే అపార్ట్మెంట్ లో నివాసముండే సతీశ్ సంగమేశ్వరన్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ట్వీట్ చేశారు.‘‘ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని బీబీఎంపీ అధికారులు మా అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ కు సీల్ వేశారు. ఓ ఫ్లాట్లో మహిళ, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పక్కనే ఉన్న మరో ఫ్లాట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉందని తెలుసు కానీ.. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వారి పరిస్థితి ఏమిటి? దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి…’’ అని ట్వీట్ చేశారు. తలుపులకు సీల్ వేయడం వల్ల వారికి నిత్యావసరాలు అందించడం కూడా కష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో … అధికారులు చేసిన ఈ నిర్వాకంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై బీబీఎంపీ కమిషనర్ ఎన్. మంజునాథ ప్రసాద్ వివరణ ఇస్తూ.. తమ సిబ్బంది ప్రవర్తనపై క్షమాపణలు చెప్పారు. వెంటనే రేకులను తొలగించాలంటూ ఆదేశించారు.
BBMP sealing done in our building for a confirmed Covid case. Lady with 2 small children, next door neighbours are an aged couple. What if there is a fire, @BBMPCOMM ? Understand the need for containment, but this is an extremely dangerous fire hazard – please address urgently. pic.twitter.com/pCDMn5Pefl
— Satish Sangameswaran (@satishs) July 23, 2020