బెంజ్​ సేల్స్​ డబులైనయ్​

బెంజ్​ సేల్స్​ డబులైనయ్​

ముంబై: ఈ ఏడాది సెప్టెంబరు నెలలో మెర్సిడెజ్​–బెంజ్​ కార్ల అమ్మకాలు నూరు శాతం పెరిగాయి. దేశంలో ఈ సెప్టెంబరులో మొత్తం 4,101 లగ్జరీ కార్లను అమ్మినట్లు కంపెనీ వెల్లడించింది. జులై–సెప్టెంబర్​ 2020 మధ్య కాలంలో మెర్సిడెజ్​–బెంజ్​ దేశీయ మార్కెట్లో 2,058 కార్లను మాత్రమే అమ్మింది.  ఎకానమీ రికవరీకి ఈ సేల్స్​ ఇండికేటర్​గా నిలుస్తాయి. ఏప్రిల్​–జూన్​లో కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​ వల్ల అమ్మకాలు బాగా తగ్గాయి. కానీ, 2021 క్యూ 3లో పరిస్థితులు మారాయని అమ్మకాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటిదాకా మొత్తం సేల్స్​ 78 శాతం పెరిగి 5,007 యూనిట్లకు చేరాయని మెర్సిడెజ్​–బెంజ్​ తెలిపింది. చాలా కొత్త ప్రొడక్ట్​లను మార్కెట్లోకి తేవడంతోపాటు, కస్టమర్ల సెంటిమెంట్​ బెటరవడం వల్లే అమ్మకాలు పుంజుకుంటున్నాయని పేర్కొంది. మూడో క్వార్టర్లో కస్టమర్ల నుంచి డిమాండ్​ భారీగా ఉందని, ఎకానమీ రికవరీ వల్లే ఇది సాధ్యమైందని మెర్సిడెజ్​–బెంజ్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ మార్టిన్​ స్వెంక్​ చెప్పారు. రాబోయే పండగల సీజన్​లోనూ అమ్మకాలు ఇదే ఊపుతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లోని అమ్మకాలను ఈ ఏడాది 9 నెలల్లోనే దాటేశామని, ఫెస్టివల్​ సీజన్​లో మరింత మెరుగైన సేల్స్​ సాధ్యమేనని అన్నారు. రాబోయే క్వార్టర్లోనూ మరిన్ని కొత్త మోడల్స్​ను ఇండియా మార్కెట్లోకి తేనున్నట్లు మార్టిన్​ వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా ప్రొడక్షన్​నూ పెంచుతున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఈక్యూసీ కోసం ఆర్డర్లు పెరుగుతున్నాయని, అక్టోబర్​ నెలలో కొత్త బ్యాచ్​ రానుందని వివరించారు.