బెస్ట్​ జీపీలో పైసలున్నా.. పనులు కాలే

బెస్ట్​ జీపీలో పైసలున్నా.. పనులు కాలే
  • ఏప్రిల్​లో ఉత్తమ జీపీగా ఎంపికైన కొనగట్టుపల్లి
  • రూ.కోటి నజరానా ప్రకటించి నిధులు మంజూరు చేసిన కేంద్రం
  • తొమ్మిది నెలలుగా ఫండ్స్​ను వినియోగించడంలో ఫెయిల్యూర్​

మహబూబ్​నగర్/హన్వాడ​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి  వంద శాతం సామాజిక భద్రత లో  2023 బెస్ట్​ గ్రామపంచాయతీగా అవార్డు  అందుకుంది.  అందుకు కేంద్రం రూ. కోటి రివార్డు కూడా  మంజూరు చేసింది. కానీ, ఇప్పటికీ ఆ నిధులను వాడుకోలేదు.    ఆ నిధులకు గ్రామఆభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులపై ప్రాతి పాదనలు పంపినా గత ప్రభుత్వ హాయంలో అధికారుల నుంచి ఆమోదం రాలేదు.  కొత్త సర్కారు రావడంతో ఇప్పటికైనా  మోక్షం కలుగుతుందేమో అని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. 

  ప్రపోజల్స్​ పంపినా.. స్పందన లేదు.. 

గ్రామంలో అభివృద్ధి పనుల  ప్రపోజల్స్​ పంపినా ఇంత వరకు ఒక్క పనికి కూడా  శాంక్షన్​ కాలేదు.    గ్రామ పంచాయతీలో 1,665 జనాభా ఉండగా, 421 కుటుంబాలున్నాయి. ఈ పంచాయతీకి కిందటి ఏడాది మార్చి 31న  రాష్ట్ర స్థాయి,    ఏప్రిల్​ 7న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ  అవార్డు కూడా అందుకుంది. దీంతో సెంట్రల్​ గవర్నమెంట్​ ఈ జీపీకి రూ.కోటి  రివార్డు ప్రకటించింది. అదే రోజు ఫండ్స్​ను మంజూరు చేసింది.  

ఈ పనులపై తీర్మానం

కేంద్రం నిధులతో  సోలార్ స్ర్టీట్​ లైట్స్​, సీసీ రోడ్లు, అంగన్​వాడీ సెంటర్​ డెవలప్​మెంట్​, సర్కారు బడిలో డిజిటల్ క్లాసులు, పాత జీపీ భవనం స్థానంలో కొత్త జీపీ భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ సభల్లో తీర్మానించారు.   కాపీని  కలెక్టర్​కు   పంపించారు. కానీ, ఏ ఉపయోగం లేకుండా పోయింది.  గత రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ జీపీకి అవార్డు ఇచ్చిన సమయంలోనే రూ.30 లక్షల నజారాను ప్రకటించింది. కానీ,  ప్రొసిడింగ్స్​ ఆలస్యంగా జారీ చేసింది. ప్రొసిడింగ్స్​ను జారీ చేసిన రెండు రోజులకే కోడ్ అమల్లోకి​ రావడంతో పనులు చేపట్టే అవకాశం రాలేదు.  

రాజకీయ ఒత్తిళ్లతోనే ..

 కేంద్రం ఇచ్చిన రూ. కోటితో పనలు చేపట్టకుండా.. ఓ లీడరే అడ్డంపడ్డట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు పనులు చేయడం దండుగ అని, ఎన్నికల తర్వాత ఏం చేయాలో చూద్దామని అధికారులకు చెప్పినట్టు సమాచారం.  అలాగే ఈ గ్రామ, మండల లీడర్ల మధ్య ఉన్న విబేధాలు కూడా పనులు కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం ఫండ్స్​ ఇప్పుడే వాడితే తర్వాత వచ్చే సర్పంచులు పనులు చేసుకోవడానికి ఎలాంటి నిధులుండవని, ఈ నిధులను  వాడొద్దని లీడర్ల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దీనికితోడు మండల ఆఫీసర్లు కూడా గత ప్రభుత్వంలోని కొందరు లీడర్ల ఆదేశాలతో డెవలప్​మెంట్​ పనులకు ప్రపోజల్స్​ పంపినా పక్కన పెట్టినట్లు తెలిసింది.

పనుల్లో డొల్లతనం :   

ఈ జీపీలో చేసిన డెవలప్​మెంట్​ పనుల్లో డొల్లతనం బయట పడుతోంది. గత మార్చిలో ఈ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. ఏడాది కాక ముందే ఈ రోడ్లకు పగుళ్లు వచ్చాయి. నాసిరకంగా పనులు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో కాలువలు నిండిపోయాయి మురుగు నీరు మొత్తం రోడ్లపైనే పారుతోంది. మూడు నెలలుగా స్ర్టీట్​ లైట్లు వెలగడం లేదు. బల్బులు కాలిపోయినా వాటిని రీప్లేస్​ చేయలేదు. కొన్నిచోట్ల కరెంటు కనెక్షన్లు తెగిపోయినా ఇప్పటి వరకు సరి చేయలేదు. దాదాపు అర్ధ ఎకరా నుంచి ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాల్సి ఉండగా, కేవలం ఆరేడు గుంటల స్థలంలోనే దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం పక్కనే పెంట దిబ్బ ఉంది. దానికి ఆనుకొని చిన్న బావి ఉండటంతో వాసన వస్తోంది. ఉన్న ఆరేడు గుంటల స్థలంలో ఎక్సర్​సైజ్​ చేసుకునేందు కోసం ఇనుప రాడ్స్​ ఏర్పాటు చేయగా, వాటి పక్కనే రెండు కరెంట్​ పోల్స్​ ఉండటంతో వీటి దగ్గరికి ఎవరూ రావడం లేదు.

ఆఫీసర్లు సహకరిస్తలేరు..

రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొందరు అధికారులు సహకరించడం లేదు.   పలు   పనులకు తీర్మానం చేసి మండల అధికారుల ద్వారా కలెక్టర్​కు ప్రతిపాదనలు పంపాం. ఆ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇంత వరకు ఖర్చు కాలేదు. ప్రొసిడింగ్ వస్తే  అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.

మానస, సర్పంచ్​, కొనగట్టుపల్లి, హన్వాడ మండలం

ప్రపోజల్స్​ మళ్లీ పంపిస్తాం

కొనగట్టుపల్లికి  జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు వచ్చాయి. కేంద్రం రూ.కోటి   ప్రకటించింది. గత ప్రభుత్వం రూ.30 లక్షలు   ప్రకటించగా , ప్రొసిడింగ్ ఇచ్చాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పట్లో పలు   పనులకు ప్రపోజల్స్​ పంపాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా డెవలప్​మెంట్​ పనులకు ప్రపోజల్స్​ పంపిస్తాం

శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ