
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీవో.. కట్టపై చెత్తవేయొద్దని సూచన
భద్రాచలం, వెలుగు : గోదావరి కరకట్టపై బుధవారం డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. దీంతో ఆలయ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భక్తులతో పాటు, పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈవో శ్రీనివాసరావు వెంటనే కట్టపైకి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. ఫైరింజన్ వచ్చి మంటలను అదుపు చేసింది. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో బి.రాహుల్ గోదావరి కరకట్ట వద్దకు చేరుకున్నారు. పంచాయతీ ఈవో శ్రీనివాసరావు ద్వారా వివరాలు సేకరించారు.
ఇకపై చెత్తను గోదావరి కరకట్టపై వేయొద్దని సూచించారు. తడిపొడి చెత్తను ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించి మనుబోతుల చెరువులో నిర్మించిన డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. కరకట్ట స్నానఘట్టాల వద్ద నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని, అటువంటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని ఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. ఇష్టారాజ్యంగా చెత్తను కట్టపై వేయొద్దని హెచ్చరించారు.