
- గోదావరి తీరంలో ఎక్కడి సమస్యలు అక్కడే
- వచ్చేది వరదల కాలం.. బెంబేలెత్తుతున్న జనం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం వరదల కాలంలో బెంబేలెత్తుతోంది. స్థానికులకు పోలవరం బ్యాక్ వాటర్ బెంగ పట్టుకుంది. తీరంలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసి ఆఫీసర్లకు సవాళ్లను విసురుతున్నాయి. 2022 నాటి వరదల ప్రమాదం నుంచి వారు గుణపాఠం నేర్చుకున్నది ఏమీ లేదు. 32 ఏండ్లలో ఎన్నడూ చూడని నష్టాన్ని, కష్టాన్ని ఏజెన్సీ ప్రజలు అప్పుడు చూశారు. 71.3 అడుగుల నీటిమట్టానికి మన్యం అతలాకుతలం అయ్యింది.
15,465 కుటుంబాలు నిరాశ్రయులు కాగా, 5,047 మంది రైతులు 10,831 ఎకరాల్లో తమ పంటలను కోల్పోయారు. తర్వాత కాలంలో దిగువన పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ తెగిపోవడంతో బ్యాక్ వాటర్ ప్రభావం తగ్గింది. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరం డ్యామ్ వద్ద కాపర్ డ్యామ్ను తిరిగి నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరుకు అది పూర్తవుతుంది. ఈ వరదకాలంలో భద్రాచలం మన్యంకు ఎప్పటిలాగే తిరిగి బ్యాక్ వాటర్ ముప్పు తప్పదని తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాబోయే జలప్రళయాన్ని ఊహించుకుని విలవిల్లాడుతున్నారు.
నత్తనడకన కరకట్టల నిర్మాణం...
భద్రాచలం టౌన్ను గోదావరి వరదల నుంచి కాపాడే కరకట్టల నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. రూ.38కోట్లతో ప్రారంభించిన 700మీటర్ల పొడవైన కరకట్టనిర్మాణపు పనులు రెండో సంవత్సరం గడుస్తున్నా పూర్తి కాలేదు. కూనవరం రోడ్డులోని శాంతినగర్, సుభాష్నగర్, కొత్తపేట కాలనీలకు వరద ముంపు తప్పేలా లేదు. మరోవైపు పాత కరకట్టల బలోపేతం పైనా ఎలాంటి చర్యలను నేటికీ ఇరిగేషన్ఇంజినీర్లు చేపట్టలేదు. కొన్ని చోట్ల బుంగలు ఉన్నాయి.
ఇక రామాలయం స్నానఘట్టాల వద్ద స్లూయిజ్ల సమస్య కలవర పెడుతోంది. అశోక్నగర్ కొత్తకాలనీకి చెందిన కొన్ని కుటుంబాలను డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి మార్చారు. మరికొందరు ఇంకా అక్కడే ఉన్నారు. ఎటపాక వైపు కరకట్టలు భయపెడుతున్నాయి. పాతకరకట్టల నిర్వహణ సరిగా లేదు. వరదలను ఈసారి ఎదుర్కోవడం పెనుసవాల్గా మారింది.
అటకెక్కిన పునరావాసం..
వరదల ప్రభావం ఇటీవల దుమ్ముగూడెం మండలంపై తీవ్రంగా పడుతోంది. సీతమ్మసాగర్ బ్యారేజ్ నిర్మాణంతో బ్యాక్ వాటర్ కారణంగా పలు గ్రామాలు ముంపునకు గురౌతున్నాయి. ఇక్కడ 24 గ్రామాలపై తీవ్రమైన ప్రభావం ఉంది. సున్నంబట్టి, దుమ్ముగూడెం, వర్కుషాపు, కాశీనగరం, బైరాగులపాడు గ్రామాల్లో వరద సృష్టించిన భయానకం అంతా ఇంతా కాదు. 2022 వరదల్లో 1,996 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ఎత్తైన ప్రాంతంలో ఇండ్ల నిర్మాణానికి నాటి కలెక్టర్అనుదీప్ కార్యాచరణ చేపట్టారు.
మండలంలోని రామచంద్రాపురంలో సర్వే నెంబర్ 32లో 15 ఎకరాలు, దుమ్ముగూడెం సర్వే నెంబరు 170లో 1 ఎకరం, సర్వే నెంబరు 176లో 4 ఎకరాలు, చినబండిరేవులో 20 ఎకరాలు, అంజిపాకలో ప్రభుత్వ భూమిని పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. అది ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ అరిష్టాలను దాటితేనే వరద గండం నుంచి గోదావరి తీర ప్రాంతం బయటపడుతుందని, లేకపోతే మళ్లీ కష్టాలు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.