
- గోదావరి బ్రిడ్జి సమీపంలో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు
- మొత్తం 40 ఇండ్లలో 33 ఇండ్ల నిర్వాసితులకు పరిహారం చెల్లింపు
- పరిహారం తక్కువ ఇస్తున్నారని మిగతా కుటుంబాల నిరాకరణ
- ఆ ఏడు కుటుంబాలతో చర్చలు జరుపుతున్నామంటున్న అధికారులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం మాడవీధుల అభివృద్ధిలో భాగంగా సేకరించిన ఇండ్లను తొలగించే పనులను బుధవారం ఆర్అండ్బీ అధికారులు షురూ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టాక 2024 సెప్టెంబరు 13న ప్రత్యేక నిధులను రూ.60.20కోట్లను రిలీజ్ చేసింది. 40 ఇండ్లను సేకరించేందుకు నిర్వాసితుల కోసం రూ.34,45,86,000 కేటాయించింది. 33 ఇండ్లకు సంబంధించిన నిర్వాసితులు పరిహారం తీసుకున్నారు. ఆ ఇండ్లను తొలగించేందుకు అధికారులు జేసీబీలను రంగంలోకి దించారు.
అయితే ఇండ్లలోని విద్యుత్ మీటర్లు, గుమ్మాలు, తలుపులు, కిటికీలు, ఇతర వస్తువులను నిర్వాసితులే స్వయంగా తీసుకున్నారు. భవనాలను మాత్రం అధికారులు జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. ఇంకా ఏడు కుటుంబాల వారు పరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తమకు పరిహారం తక్కువగా వస్తుందని వారు వాదిస్తున్నారు. అయితే తీసుకున్న వారి ఇండ్లను కూల్చాలని ఆదేశాలు రావడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది.
సకల సౌకర్యాలతో ఆర్అండ్ ఆర్కాలనీ..
2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించిన ప్రభుత్వం, వారికి ఆర్అండ్ ఆర్ కాలనీని నిర్మిస్తోంది. ఇందుకోసం గోదావరి వంతెన సమీపంలోని ఆర్అండ్ బీ స్థలాన్ని ఎంపిక చేసిన సంగతి విదితమే. ఒకవైపు నిర్వాసితుల నుంచి తీసుకున్న ఇండ్లను తొలగిస్తున్న అధికారులు, అదే సమయంలో ఆర్అండ్ ఆర్ కాలనీ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి 90 చదరపు గజాల చొప్పున కేటాయించారు. మొత్తం 70 ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
అయితే ముందుగా ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేశారు. కేటాయించిన స్థలంలో రాళ్లు ఉండటంతో వాటిని జేసీబీల సాయంతో పగులగొట్టి చదును చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నారు. కరెంట్ సౌకర్యం, వాటర్ ట్యాంకు నిర్మించనున్నారు. తర్వాత కాలనీ నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు అప్పగించనున్నారు. విజయవాడ-–జగదల్పూర్ నేషనల్హైవే పక్కనే ఈ కాలనీ నిర్మిస్తున్నారు.
మిగతా వారికి పరిహారం ఇస్తాం
ఆలయం చుట్టూ తీసుకున్న ఇండ్లకు సంబంధించిన పరిహారం 80 శాతం మందికి పంపిణీ చేశాం. వారు ఖాళీ కూడా చేశారు. ఆ ఇండ్లను తొలగిస్తున్నాం. మిగతా నిర్వాసితులతో చర్చలు జరిపి వారికి కూడా పరిహారం ఇస్తాం. మణుగూరు బీటీపీఎస్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలో ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించి ఇస్తాం.
దామోదర్, ఆర్డీవో, భద్రాచలం