భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘నా చావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కొడుకు వనమా రాఘవతో పాటు మరికొందరు కారణం’ అంటూ ఎస్పీ పేరిట సూసైడ్ లెటర్రాసి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వికలాంగ కాలనీకి చెందిన రైతు మలిపెద్ది వెంకటేశ్వర్లు(40)కు భార్య శ్రావణి, ఇద్దరు కూతుళ్లున్నారు. తమ బంధువులైన ఇందుకుమారి, భానుకుమార్, పవన్వద్ద వెంకటేశ్వర్లు రూ. 25 లక్షల చొప్పున రెండు చిట్టీలు వేశారు. చిట్టీ పాడుకున్నా డబ్బులు ఇవ్వలేదు. గట్టిగా అడగడంతో చివరకు కొంత ల్యాండ్ రాసిచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు ఆ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. కాగా అదే స్థలాన్ని సత్తుపల్లికి చెందిన కానిస్టేబుల్మల్లెల రామారావు కుటుంబసభ్యులకు కూడా భానుకుమార్, పవన్ అమ్మినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని ఇందుకుమారి ఇంటికి వెళ్లి అడగగా తిట్టడంతో పాటు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కొడుకు వనమా రాఘవ సాయంతో అక్రమ కేసులు పెట్టారు. మార్చి నెలలో వెంకటేశ్వర్లును జైలుకు పంపించారు. వెంకటేశ్వర్లు జైలుకు వెళ్లిన టైంలో వనమా రాఘవ సాయంతో రేకుల షెడ్డును కూల్చివేయడంతో పాటు ల్యాండ్ను ఆక్రమించుకున్నారు. బెయిల్పై వచ్చిన వెంకటేశ్వర్లు విషయం తెలుసుకొని ఇందుకుమారి, పవన్, భానుకుమార్ వద్దకు పలుసార్లు వెళ్లారు. వారు అతడిపై దాడి చేయడంతోపాటు ఎమ్మెల్యే కొడుకు తమకు అండగా ఉన్నాడంటూ బెదిరించారు. గురువారం సైతం తనకు రావాల్సిన డబ్బుల గురించి ఇందుకుమారి ఇంటికి వెళ్లి అడిగారు. అక్కడ భానుకుమార్, పవన్కలిసి వెంకటేశ్వర్లును తిట్టడంతో పాటు కొట్టారు. మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు బజారులో పురుగుల మందు కొనుక్కొని తాగారు. ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా భార్యకు చెప్పాడు. అప్పటికే నోటి నుంచి నురుగు వస్తుండడంతో భార్య వెంటనే పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తగూడెం గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటనపై పోలీస్ఆఫీసర్లు సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
3 గంటలపాటు కంప్లైంట్ తీసుకోలే
సూసైడ్ నోట్లో ఎమ్మెల్యే కొడుకు రాఘవతో పాటు మరికొందరు కారణమంటూ రాసి ఉండడంతో పాల్వంచ పోలీసులు దాదాపు 3 గంటలపాటు కంప్లైట్ తీసుకోలేదని మృతుడి భార్య శ్రావణి వాపోయారు. చివరకు కంప్లైట్ తీసుకున్నా ఎటువంటి రశీదు ఇవ్వలేదన్నారు. పోస్టుమార్టం విషయంలోనూ చాలా జాగు చేశారని వాపోయారు.