భద్రాద్రికొత్తగూడెంను గంజాయి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలి :  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెంను గంజాయి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలి :  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెంను గంజాయి, డ్రగ్​ ఫ్రీ జిల్లాగా మార్చాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీని ఆయన ప్రారంభించారు.

అనంతరం కొత్తగూడెం క్లబ్​లో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్​జితేశ్​వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్​రాజు మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్​పై పోలీస్​శాఖ ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. గంజాయి అమ్మేవారి వివరాలను తమకు ఇవ్వాలని కోరారు.  డీఎఫ్ వో కృష్ణగౌడ్, ఎక్సైజ్​సూపరింటెండెంట్ జానయ్య, డీఎస్పీలు రెహమాన్, కరంచంద్​తదితరులు పాల్గొన్నారు. 

మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: వరల్డ్​యాంటీ డ్రగ్​ వీక్​లో భాగంగా గురువారం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మమత మెడికల్, హార్వెస్ట్, ఎస్ ఆర్ అండ్ జీజీఎన్ ఆర్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీని సీపీ సునీల్​దత్​అడిషనల్ కలెక్టర్(లోకల్​బాడీస్) పి. శ్రీజతో కలిసి, జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు బానిసలై, బంగారు భవిష్యత్​ను అంధకారం చేసుకోవద్దంటూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి, యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సైన్ చేశారు.

సీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. అడిషనల్ ​కలెక్టర్ మాట్లాడుతూ.. సరదా కోసం మత్తు పదార్థాలు తీసుకుంటే అవి జీవితాన్ని అంధకారంలోకి నెడతాయని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు,టౌన్ ఏసీపీ రమణమూర్తి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి రామ్​గోపాల్ రెడ్డి , డాక్టర్ నితీశ్, ఇన్​స్పెక్టర్లు భానుప్రకాశ్, కరుణకర్, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి

కూసుమంచి, వెలుగు: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని ఖమ్మం రూరల్​ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో విద్యార్థుల ర్యాలీ ప్రారంభించారు. సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్, ఏఎస్సై రామలింగారెడ్డి, పోలీస్​సిబ్బంది ఉన్నారు.

మత్తు రహిత సమాజమే లక్ష్యం కావాలి 

పాల్వంచ, వెలుగు: మత్తు రహిత సమాజమే అందరి లక్ష్యం కావాలని పాల్వంచ డీఎస్ పీఆర్ సతీశ్​కుమార్ సూచించారు. గురువారం పాల్వంచ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పలు కళాశాలల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.  సీఐ సతీశ్, ఎస్సైలు సుమన్, జీవన్ రాజ్, సురేశ్, కల్యాణి ఉన్నారు.

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు 

కామేపల్లి, వెలుగు: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని కారేపల్లి రూరల్ సీఐ తిరుపతి రెడ్డి సూచించారు. గురువారం కొత్త లింగాల నుంచి కామేపల్లి వరకు పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. ఎస్సై సాయికుమార్, పలు విద్యాసంస్థల ప్రతినిధులు, పోలీస్​సిబ్బంది పాల్గొన్నారు. 

డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

కారేపల్లి,వెలుగు: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఎస్సై గోపి కోరారు. పోలీస్, ఎక్సైజ్ పోలీస్, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కారేపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో జయరాజు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ సౌజన్య తదితరులున్నారు. 

చెడు వ్యసనాలకు బానిసలైతే జైలు

మధిర, వెలుగు: చెడు వ్యసనాలకు బానిసలై దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ఎక్సైజ్ అండ్​ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి , మధిర టౌన్​ సీఐ డి.రమేశ్​తెలిపారు. గురువారం దిడుగుపాడులోని షేర్​సంస్థకు సంబంధించిన మత్తు పదార్థాల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఏకేఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొండలరావు, ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి, ట్రైనీ ఎస్సై నవిత, విద్యార్థులు పాల్గొన్నారు.  

డ్రగ్స్​ వాడొద్దు..

డ్రగ్స్​వాడొద్దని.. వాడితే కఠిన శిక్షలు పడతాయని మధిర సీనియర్ సివిల్ జడ్జి ఎన్. ప్రశాంతి అన్నారు. గురువారం  దిడుగుపాడులో షేర్ సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి ర్యాలీ తీశారు.  సంస్థ డైరెక్టర్​ గోపాల్​రావు, మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ షమీమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.పుల్లారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.