భద్రాచలం సీతారాముల కల్యాణానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం సీతారాముల కల్యాణానికి పోటెత్తిన భక్తులు

ఆకాశమంత పందిరి... భూదేవంత అరుగు. సకల దేవతలు తరలిరాగా భద్రాద్రిలో  సీతారాముల కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాల నుంచి మొదలు... గల్లీ గల్లీల్లో చలువ పందిళ్లు, పచ్చని తోరణాలతో కల్యాణ మండపాలు కొలువుదీరాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదబిరాముడి... లోకమాత సీతాదేవి లగ్గానికి ఆలయ అధికారులు, వేద పండితులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేదికను రంగ రంగ వైభవంగా తీర్చిదిద్దారు. మొత్తం 3.50 లక్షల చదరపు అడుగుల్లో పందిళ్లు వేసి కూలర్లు ఏర్పాటు చేశారు. ఈసారి క్లీన్ భద్రాద్రి.... క్లీన్ శ్రీరామనవమి పేరుతో జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ప్యాకెట్ల ప్లేస్ లో బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. 

భద్రాచలం రాములోరి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా ప్రజాప్రతినిధులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో  కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు. 

ఇవాళ సీతారాముల కల్యాణం, రేపు రామయ్య పట్టాభిషేకం వైభవంగా జరగనున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణతో రామాలయం భక్తులకు  కనువిందు చేస్తోంది. భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రెండేళ్ల తర్వాత  మొదటిసారి భక్తులను రాములోరి కళ్యాణానికి అనుమతి ఇవ్వటంతో  పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ అధికారులు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరగనున్న కళ్యాణానికి ఈ ఏడాది భక్తులు భారీగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు లడ్డూ ప్రసాదాలు, తలంబ్రాలను భారీగా సిద్ధం చేశారు. నిన్న భద్రాచలం ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. తర్వాత గరుడవాహన సేవ జరిపారు. 

రాములోరి కళ్యాణం తిలకించేందుకు పెద్ద పెద్ద LED  స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కావడంతో.. చలువ పందిళ్లు, షామియానాలు, కూలర్లను ఏర్పాటు చేశారు. మంచినీరు అందుబాటులో ఉంచారు.  మిథిలా స్టేడియంను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం 170 క్వింటాళ్ల  తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు పెట్టారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 2కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేశారు. 

ఆలయం మొత్తం తీరొక్క పూలు,  విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు వెల్కమ్ చెప్తూ స్వాగత ద్వారాలు  ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దాదాపు 2వేల మందికి పైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలంను మొత్తం 12 సెక్టార్లుగా విభజించి.. 7 ప్రాంతాలలో పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు 16 మంది డీఎస్పీలు.. 54మంది సీఐలు.. 270మంది ఎస్ఐలు.. స్పెషల్ ఫోర్సెస్ తో... పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.