
రేగొండ, వెలుగు: జయశంకర్భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడేపాక ఐకేపీ కొనుగోలు సెంటర్లోకి కొందరు వ్యక్తులు భగీరథ నీళ్లను మళ్లించడంతో దాదాపు 3 వేల బస్తాల వడ్లు తడిసిపోయాయి. చిన్నకోడేపాకలో ఐకేపీతో పాటు ఓడీసీఎంఏస్ఆధ్వర్యంలోనూ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఓడీసీఎంఏస్ సెంటర్ కు ఎక్కువగా వడ్లు రాలేదు. ఈ క్రమంలోనే నీటిని మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం వాటర్ ట్యాంక్ దగ్గరున్న భగీరథ గేట్వాల్వ్లను దుండగులు ధ్వంసం చేసి నీళ్లను కొనుగోలు సెంటర్ వైపు మళ్లించారని, అక్కడున్న మూడు వేల బస్తాలతో పాటు కళ్లంలో ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయని రైతులు తెలిపారు. వడ్లు తడిసిన విషయం తెలిసి గ్రామానికి వచ్చిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఎస్సై శ్రీకాంత్రెడ్డికి సూచించారు. నిర్లక్ష్యంగా ఉన్న సెంటర్ ఇన్ చార్జ్ను సస్పెండ్ చేయాలని ఐకేపీ ఆఫీసర్ను ఆదేశించారు. తడిసిన వడ్లను కూడా తీసుకోవాలని మిల్లర్లకు ఎమ్మెల్యే చెప్పారు. కాంటా అయిన 482 బస్తాలను ఏవో పెద్ది వాసుదేవరెడ్డి మిల్లుకు తరలించారు.