- కౌన్సిల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన మెడికల్ ఇన్వాలిడేషన్(వైద్య కారణాల వల్ల ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించడం)పై విచారణ జరిపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం కౌన్సిల్లో బీఆర్ఎస్ సభ్యుడు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 నుంచి 2023 వరకు ఐదేండ్ల కాలంలో సింగరేణిలో మొత్తం 13,119 మంది మెడికల్ ఇన్వాలిడేషన్కు గురయ్యారని తెలిపారు. అవసరం లేకపోయినా పెద్ద సంఖ్యలో ఇన్వాలిడేషన్ జరిగిందని, దీంతో సంస్థపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు.
ఈ వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. 2000 నుంచి 2014 వరకు 14 ఏండ్లలో 3,859 ఇన్వాలిడేషన్లు మాత్రమే జరిగాయని, దీంతో బీఆర్ఎస్ హయాంలో దుర్వినియోగం జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సంస్థల నిబంధనలు పరిశీలించి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
