1969 లో తెలంగాణ ఉద్యమంలో 365 మంది చనిపోతే.. మలి దశ ఉద్యమంలో 1200 మంది చనిపోయారన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తామన్న సీఎం కేసీఆర్... ఏడున్న ఏళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. వారికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా అన్నారు. ఏమైంది.. 479 మందికి ఇచ్చాం అని అంటున్నారు..మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
చావో రేవో తేల్చుకోని వస్తా అని ఢిల్లీకి కేసీఆర్ వెళ్లారని.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ముందు రోడ్లపై వచ్చి కూర్చున్నారు.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చాక యూ టర్న్ తీసుకున్నారన్నారు.
ఇప్పుడు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చాక యూ టర్న్ తీసుకుంటారా..అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. అమిత్ షా ను కలిశాక తప్పకుండా కేసీఆర్ తీరు మారుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు ధాన్యం రాసులుగా పోసి ఎదురు చూస్తున్నారు.. అకాల వర్షాలకు వడ్లు తడిసి పోతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ధాన్యం కొనెలా చూడకుండా.. కేంద్రంతో యుద్ధం చేస్తానని ఢిల్లీ కి వెళ్లి కూర్చున్నారని అన్నారు.
కేంద్రం నీటి ప్రాజెక్టుల డిపిఆర్ అడుగుతోంది. పక్క రాష్ట్రాలు.. డిపిఆర్ ఇస్తుంటే.. కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో అర్దం కావడం లేదన్నారు భట్టి విక్రమార్క. వడ్ల పంచాయితీ మాత్రమే కాకుండా నీటి పంచాయితీ కూడా అందరికీ తెలియాలన్నారు.