- టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని నిలదీసిన దేశ్ముఖ్ గ్రామస్తులు
- రోడ్డు మంచిగ లేక బస్సు కూడా వస్తలేదని ఆవేదన
యాదాద్రి : భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎనిమిదేండ్లుగా రోడ్డు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘రోడ్డు వేయించు.. లేకుంటే రాజీనామా చెయ్” అంటూ నిలదీశారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు గ్రామాభివృద్ధి కోసం ఫండ్స్ వస్తాయని, పనులు జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న వారిలో టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కూడా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని బాటసింగారం, దేశ్ముఖ్ గ్రామాలనుంచి పిలాయిపల్లి వరకు 4 కిలోమీటర్ల రోడ్డు గుంతలు పడి దారుణంగా మారింది. దీంతో ఊరికి స్కూల్ బస్సు రావడం లేదు. ఎనిమిదేండ్లుగా ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే శేఖర్రెడ్డికి ఎన్నిమార్లు చెప్పినా స్పందించలేదని, కనీసం ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని గ్రామస్తులు అంటున్నారు. బుధవారం దేశ్ముఖ్ గ్రామంలోని సాయి బృందావనం ఆలయంలో మంత్రి సబితారెడ్డి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుపై ఆయన కారును అడ్డుకున్నారు.
రోడ్డు సమస్యలను వివరించగా.. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘‘రోడ్డు వేయించడం చేతకాకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ఫండ్స్వస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. మీరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఉప ఎన్నిక వస్తే డెవలప్మెంట్ కోసం ఫండ్స్ వస్తాయి. రోడ్డు బాగుపడుతుంది” అని గ్రామస్తులు అనడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ‘‘ఎమ్మెల్యే శేఖర్రెడ్డి.. గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి రోడ్డులేక బస్సులు రావడంలేదని, స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు, పనులకు వెళ్లేందుకు జనం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.