- మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని మాజీ ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురంలోని గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ 18 వ వార్షికోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందజేసిన మాట్లాడారు.
కార్పొరేట్కాలేజీకి ఏ విషయంలో తీసిపోకుండా ప్రభుత్వ కాలేజీని సొంత నిధులతో అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. జూనియర్ కాలేజీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధూ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్టూడెంట్స్ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని సూచించారు. పేదల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్రెడ్డి, ప్రిన్సిపాల్వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పుష్పనగేశ్, అంజయ్య యాదవ్, కుమార్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, వెన్నవరం సంతోష్ రెడ్డి, అప్పల భాస్కర్, గౌస్ పాల్గొన్నారు.
