యాదాద్రి, వెలుగు: చేనేత రంగాన్ని ఆదుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కోరారు. ఢిల్లీలో జరిగిన టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ మీటింగ్లో చేనేత రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కార్మికుల సమస్యలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్కు వివరించారు. చేనేత రంగం ఆర్ధిక వ్యవస్థలో కీలకంగా ఉంటుందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయని చెప్పారు. ఎగుమతి కూడా చేస్తున్నారన్నారు. ఇక్కత్ వస్త్రాలకు నకిలీ దెబ్బతీస్తోందని తెలిపారు.
ఒక్కో చీర రూ. 10 వేలకు నేత కార్మికుడు డిజైన్ చేస్తే.. అదే డిజైన్తో రూ. 600 తోనే చీరలు మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పారు. దీంతో అసలు వస్త్రాల మార్కెటింగ్లో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, చేనేత రంగంపై ఆధారపడిన వారందరూ ఆర్ధికంగా దెబ్బతింటున్నారని చెప్పారు. చేనేతపై సాంకేతికత ప్రభావం చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రూ. 100 కోట్లతో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. అసలైన పోచంపల్లి చీరలకు అథెంటికేషన్ ట్యాగ్జత చేయాలన్నారు. బ్రాండ్అంబాసిడర్తో చేనేత వస్త్రాలకు ప్రచారం నిర్వహించాలన్నారు. అదే విధంగా నకిలీ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

