- మొన్న కమ్యూనిస్టులతో.. గత నెలలో స్టాలిన్తో భేటీ
- రాష్ట్రంపై బీజేపీ ఫోకస్తో రూటు మార్చిన సీఎం
- ఇటీవల రాష్ట్రానికి వరుసకట్టిన బీజేపీ టాప్ లీడర్లు
- టీఆర్ఎస్పై గట్టిగ కొట్లాడాలని కేడర్కు పిలుపు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు దగ్గరయ్యే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర రాష్ట్రాల నేతలతోనూ రాజకీయ దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, బీహార్ అపొజిషన్ లీడర్ తేజస్వీ ప్రసాద్ యాదవ్ మంగళవారం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఆర్జేడీ లీడర్లు పాట్నా నుంచి వచ్చి ప్రగతి భవన్లో సమావేశమవడం ఆసక్తి రేపుతున్నది. కేసీఆర్ను తేజస్వీ యాదవ్తో పాటు బీహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్ధిఖీ, మాజీ ఎమ్మెల్యేలు సునీల్ సింగ్, భోలా యాదవ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. భేటీకి గల కారణాలేమీ వెల్లడించలేదు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న టైం కావటంతో ఈ సమావేశంలో రాజకీయ సమాలోచనలు జరిగి ఉండొచ్చన్న చర్చకు తెరలేచింది. ఇంతకీ ఆర్జేడీ లీడర్లే కేసీఆర్ను కలిసేందుకు వచ్చారా..? లేక, కేసీఆరే ప్రత్యేకంగా వారిని పిలిపించుకున్నారా..? అనే విషయంలో టీఆర్ఎస్ లీడర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోకస్ పెంచిన బీజేపీ
ఇటీవల రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ.. తెలంగాణలో ఏం జరుగుతున్నదని తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్కు వచ్చి టీఆర్ఎస్ టార్గెట్గా విరుచుకుపడి, ఇక్కడి లీడర్లను సమాయత్తం చేశారు. ‘‘స్వయంగా నేనే హైదరాబాద్ వచ్చి నిరసన ర్యాలీలో జాయిన్ అయ్యి, కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో స్ట్రాంగ్గా మాట్లాడానంటే ఎందుకో అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ జాతీయ నాయకత్వం పాలసీ ఎలా ఉందో మీరు గుర్తించాలి. గట్టిగా పోరాడాలి.. తగ్గేదే లేదు” అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇదే వరుసలో బీజేపీకి చెందిన సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్, హిమంత్ బిశ్వ శర్మ, మాజీ సీఎం రమణ్సింగ్ రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ చర్యలను ఎండగట్టడం పొలిటికల్ హీట్ ను పెంచింది. దీంతో తమను బీజేపీ ఇరుకున పెడుతుందనే ధోరణి టీఆర్ఎస్లో కనిపిస్తున్నది. బీజేపీని ఏమన్నా అంటే రాజకీయంగా దాడి చేస్తారని, విమర్శిస్తే ఐటీ, ఈడీని ప్రయోగిస్తారంటూ కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రెస్మీట్లలో ప్రస్తావించారు. ఈసారి వానాకాలంలో రైతులు పండించిన వడ్లు కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకదశలో చేతులెత్తేసింది. తప్పు తమది కానే కాదంటూ కేంద్రాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం హోదాలో కేసీఆరే ధర్నాకు దిగటంతో.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోనే ఘాటుగా స్పందించింది. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్న లీడర్లను కలిసేందుకు కేసీఆర్ ప్రయారిటీ ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
గత నెల నుంచే దోస్తీ ప్రయత్నాలు
నిరుడు డిసెంబర్లో తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లిన కేసీఆర్.. మరుసటి రోజు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు. గత వారం సీపీఐ, సీపీఎం జాతీయ స్థాయి లీడర్లు కలుసుకున్నారు. హైదరాబాద్లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులతో భేటీ అయ్యారు. అదే రోజు ఏఐవైఎఫ్ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత బినయ్ విశ్వం, కేరళ మంత్రి రాజన్ కూడా కేసీఆర్ను కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుస్తామని, అదే కోవలో కేసీఆర్ను కలిసినట్లు సీపీఎం లీడర్లు మరుసటి రోజు మీడియాకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆర్జేడీ లీడర్లతో సమావేశమయ్యారు. 2018 ఎన్నికల టైమ్లోనే కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపారు. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కుమారస్వామిని కలిసి మంతనాలు జరిపారు. అవేవీ కొలిక్కి రాకపోవటంతో సైలెంటయ్యారు. కేసీఆర్ ప్రయత్నాలు బెడిసికొట్టాయని నాడు జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు బీజేపీ నుంచి రాజకీయంగా ఎదురుదాడి పెరగడం.. స్థానికంగా ప్రతికూలత వెంటాడుతుండటంతో కేసీఆర్ ఇతర పార్టీలతో మళ్లీ టచ్లో ఉంటున్నారని సొంత పార్టీ లీడర్లే చెప్తున్నారు.
