బిల్ కలెక్టర్లు టార్గెట్ రీచ్ కావాల్సిందే:GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్

బిల్ కలెక్టర్లు టార్గెట్ రీచ్ కావాల్సిందే:GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్
  • లేకపోతే జోనల్ కమిషనర్ యాక్షన్​ తీసుకోవాలి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని పూర్తిచేయాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో శుక్రవారం ఆస్తిపన్ను వసూలు, ఫాగింగ్, పూడికతీత అంశాలపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. బిల్​కలెక్టర్లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ట్యాక్స్ కలెక్షన్ చేయాలన్నారు. 

జోనల్ కమిషనర్ సర్కిల్ వారీగా సమీక్షించి నిర్దేశించిన లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయని బిల్ కలెక్టర్లపై యాక్షన్​తీసుకోవాలన్నారు. దోమల నివారణకు చేపట్టే ఫాగింగ్ పై పర్యవేక్షణకు వార్డుకొక సూపర్​వైజర్​ను ఏర్పాటు చేయాలని, రెండు అంత కంటే ఎక్కువ వార్డులకు సూపర్ వైజర్లు నియమించవద్దనిహెల్త్ అడిషనల్ కమిషనర్ ఆదేశించారు. డీ-సిల్టింగ్ లో  కొన్ని సర్కిళ్లలో వెనుకబడి ఉన్న ఈఈలు, డిప్యూటీ ఈఈలకు షోకాజు నోటీసులివ్వాలని సీఈని ఆదేశించారు.

డెంగ్యూ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

డెంగ్యూ ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని బల్దియా కమిషనర్ ఆర్.వి.కర్ణన్ నగర వాసులను కోరారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ స్కూల్​, ఇందిరా పార్కులను విజిట్​చేశారు. 

కవాడిగూడ స్కూల్​లో విద్యార్థులతో, ఇందిరా పార్కులో వాకర్స్ తో మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా వ్యాధికి గురికాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. పిల్లలు దోమల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంట జోనల్ కమీషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమీషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.