హైదరాబాద్లో జరిగిన బయో సైన్స్ సదస్సు జీవశాస్త్ర రంగంలో ఒక గొప్ప అడుగు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృ త్వంలో, రాష్ట్ర ఐటీ, పెట్టుబడులశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకంలో విజయవంతమైన ఈ అంతర్జాతీయ బయో సైన్స్ సమావేశాల నిర్వహణ వెనుక కేవలం పెట్టుబడులు, వ్యాపార కోణమే కాకుండా సామాజిక దృ క్పథం కూడా ఉంది. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, ట్రాన్స్లేషన్ రీసెర్చ్ అండ్ మెడిటెక్ తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచస్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా బయో సైన్స్ సదస్సు జరిగింది.
ఫార్మా, బయోటెక్, వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ను ప్రపంచ రాజధానిగా నిలబెట్టేందుకు ఈ సమావేశాలు తోడ్పడుతాయి. ఇప్పటికే వ్యాక్సిన్ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాలను పూర్తిగా వినియోగించుకుంది. ‘ఫార్మా క్యాపిటల్’గా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ‘ల్యాబోరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా మార్చే దిశగా ప్రభుత్వ ఆలోచనలు కనిపిస్తున్నాయి.
‘బయో సైన్స్’ సదస్సులో 50 దేశాలకుపైగా చెందిన 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో 4వేలకు పైగా వ్యాపార సంబంధిత చర్చలు జరిగాయి. ఈ సదస్సులో 11 కంపెనీలు సుమారు రూ.5500 కోట్లకు పైగా పెట్టుబడులపై ఎంఓయూలు కుదుర్చుకోవడంతో, వీటితో సుమారు 10 వేలకుపైగా ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. దీంతో ఫార్మా సిటీలో మొత్తం పెట్టుబడులు రూ. 11 వేల కోట్లకు చేరుకోవడంతో సుమారు 23 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. ఇండోనేషియాకు చెందిన వ్యాక్సిండో యానిమల్ హెల్త్ ప్రయివేట్ లిమిటెడ్ జినోమ్ వ్యాలీలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అమెరికాకు చెందిన ఐఎన్సి రూ.300 కోట్ల పెట్టుబడులతో ఏఐ ఆధారిత హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్ అనలిటిక్స్ ఏర్పాటు చేయనుంది. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ సంస్థ జీనోమ్ వ్యాలీలో 12 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండడంతో వేలాది మంది సైంటిస్టులకు ఉపాధి దొరకనుంది.
ప్రయోగాత్మకంగా సదస్సు
బయో సైన్స్ సదస్సులో వందకుపైగా స్టార్టప్లు పాల్గొనగా వాటిలో ఏఐ రంగంలో అచలా హెల్త్ సర్వీసెస్, ఎక్స్కింజ్ లైఫ్ సైన్సెస్ సంస్థలకు, జన్యు సంబంధిత వ్యాధులకు సంబంధించి నూతన జన్ థెరఫీ, శ్వాసకోసం వైరస్లకు సంబంధించి నేచురల్ సొల్యూషన్స్ హెర్చల్ ఔషధాలకు, బయాస్పీ కచ్చితత్వం కోసం శ్రీ గురవాయి లైఫ్ సైన్సెస్ స్టార్టప్లకు అవార్డులు దక్కాయి. ఆసుపత్రుల్లో ఏఐ కీలక పాత్రపై ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసుపత్రుల్లో డాక్యుమెంటేషన్ తయారీలో ఏఐ విప్లవాత్మక పాత్ర పోషిస్తోంది. డిశ్చార్జ్ సమ్మరీ, క్లినికల్ నోట్స్, ల్యాబ్ రిపోర్డులు, మెడికల్ కోడింగ్ అంశాల్లో ఏఐ డాక్టర్లపై భారం ఏవిధంగా తగ్గిస్తుందో సదస్సులో ప్రయోగాత్మకంగా చూపించారు.
పెరుగుతున్న లైఫ్ సైన్సెస్ సంస్థలు
దేశవ్యాప్తంగా బయోటెక్ స్టార్టప్లు విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదే కావడం రాష్ట్రానికి గర్వకారణం. మరోవైపు భారత్లోని ఔషధ, జీవ శాస్త్రాల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ప్రపంచ ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కిపైగా హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, జీసీసీలు ఉన్నాయి.
మూడు లక్షలకు పైగా నిపుణులు పనిచేస్తున్నారు. వీటిలో ఫార్మా రంగానికి చెందినవి 30–-35%, లైఫ్ సైన్సెస్వి 20-–25%, మెడికల్ పరికరాలకు చెందినవి 20-–25% వాటా కలిగి ఉన్నాయి. ఫార్మా రంగంలో భారతదేశం కీలకపాత్ర పోషిస్తుండడంతో ఔషధ తయారీ ప్రక్రియలో వేగం పెంచడంతోపాటు ఆర్ అండ్ డీ ఖర్చులు తగ్గుతున్నాయి. ఏఐ, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనెటిక్స్ సాంకేతికతతో ఔషధాల తయారీ కాలం తగ్గింది. ఖర్చులు కూడా తగ్గాయి.
స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్
తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎమ్ఆర్ఎన్ఏ, జీన్ ఎడిటింగ్, కృత్రిమ ఏఐ ఆధారిత డ్రగ్స్
డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో తర్ఫీదు పొందిన నైపుణ్యం గల యువత రాష్ట్రంలో సిద్ధంగా ఉంటుంది. లైఫ్ సైస్సెస్ రంగంలో నిపుణులను తయారు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ స్కూల్ ఆప్ లైఫ్ సైన్సెస్ను ఏర్పాటు చేస్తుండడంతో దీని ద్వారా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం రాష్ట్ర విద్యార్థులకు, యువతకు అందే అవకాశాలు పెరిగాయి.
జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4ను వంద ఎకరాల్లో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీలకు భూములకు కేటాయిస్తున్న ప్రభుత్వం అదే సమయంలో ప్రజా శ్రేయస్సుకు కూడా పెద్ద పీట వేస్తోంది. కాలుష్య రహిత హామీతోనే కంపెనీలకు భూములు కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం బయట నుంచి ముడి సరుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే ఫ్యూచర్ సిటీలో ప్రాధాన్యత ఇస్తోంది.
సదస్సు ద్వారా భారీ పెట్టుబడులు
జీవ విజ్ఞాన రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో సీబీఆర్ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) అంచనా ప్రకారం బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల సరసన భారతదేశం నుంచి ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది.
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వం బయో సైన్స్ రంగంలో తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలు రాష్ట్రాన్ని ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్’గా నిలబెట్టే దిశగా నడిపిస్తున్నాయి. బయో ఏషియా 2026 సదస్సు ద్వారా అంతర్జాతీయ గుర్తింపుతోపాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల అవకాశాలు పెరిగాయి. ఏఐ, రీసెర్చ్, నైపుణ్యాభివృద్ధి రంగాలకు సంబంధించి యువతకు తర్ఫీదు అవకాశాలు పెరగనున్నాయి.
- ఐ.వి. మురళీకృష్ణ శర్మ
