
- వరుస వివాదాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆఫీసర్లు
- ఆలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ మెషీన్లు ఏర్పాటు
- అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపులపైనా ఫోకస్
సిద్దిపేట, వెలుగు: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో వరుసగా జరుగుతున్న వివాదాలు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతో పాటు అవినీతి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఉద్యోగుల హాజరు నమోదు, అన్నదాన కేంద్రం, భక్తులకు వసతి గృహాల కేటాయింపు అంశాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటి దశలో ఈ అంశాలను చక్కదిద్దాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు.
హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం
కొమురవెల్లి ఆలయంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా డ్యూటీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటెండెన్స్ విషయంలో ఇటీవల కొందరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగి ఏకంగా పోలీసులకు ఫిర్యాదుచేసే వరకు వెళ్లింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం తీసుకొచ్చేందుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. కొమురవెల్లి ఆలయంలో ప్రస్తుతం వివిధ హోదాల్లో 22 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 25 మంది పూజారులు పనిచేస్తున్నారు.
అలాగే వివిధ విభాగాల్లో 29 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, 62 మంది శానిటేషన్లు వర్కర్లు ఉన్నారు. కొందరు ఉద్యోగులు, సిబ్బంది వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే డ్యూటీకి వస్తూ రిజిస్టర్లో మాత్రం అన్ని రోజులు వచ్చినట్లుగా సంతకాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేండ్ల కిందే బయోమెట్రిక్ హాజరు నమోదును ప్రారంభించినా కొందరు ఉద్యోగులకు నచ్చకపోవడంతో దానిని రద్దయ్యేలా చేసినట్లు తెలుస్తోంది.
మాన్యువల్ రిజిస్టర్లో సంతకాలు, దిద్దుబాట్ల విషయంలో ఉద్యోగులు గ్రూప్లుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. దీంతో మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బయోమెట్రిక్ మెషీన్లు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా, సాఫ్ట్వేర్ ఇన్స్స్టలేషన్ అనంతరం మూడు, నాలుగు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు.
అన్నదాన కేంద్రంపై దృష్టి
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తుంటారు. అయితే ఈ అన్నదాన కేంద్రంలో భక్తుల కంటే బయటి వ్యక్తులే ఎక్కువగా భోజనం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 100 మంది, శని, ఆదివారాల్లో 200 వందల మంది భక్తులకు అన్నదానం చేస్తూ వస్తున్నారు. మల్లన్న దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే అన్నదాన టోకెన్లను సైతం పంపిణీ చేస్తారు.
ఈ టోకెన్లు తెచ్చిన వారికి అన్న ప్రసాదాన్ని అందించాల్సి ఉన్నా వారు వచ్చే లోపే బయటి వ్యక్తులు భోజనాలు ముగించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో అసలైన భక్తులకు అన్న ప్రసాదం అందడం లేదంటూ ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నదానం పర్యవేక్షణకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పారదర్శకంగా గదుల కేటాయింపు
కొమురవెల్లిలో భక్తుల వసతి కోసం దేవస్థానానికి సంబంధించిన గదుల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గదుల కేటాయింపులో సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న ఘటనలను గతంలో ఆఫీసర్లే గుర్తించారు. దీంతో గదుల కేటాయింపు సక్రమంగా జరిగేలా చూసేందుకు కరసత్తు చేస్తున్నారు. ముఖ్యమైన సమయాల్లో పోలీస్ సిబ్బంది కోసం పది గదులు కేటాయించినప్పటికీ అవి ఏడాది పొడవునా వారి ఆధీనంలోనే ఉంటున్నాయి. దీంతో వాటిని సైతం స్వాధీనం చేసుకొని అవసరాన్ని బట్టి పోలీసులకు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు.