యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది. మ్యూటెంట్గా రూపం మార్చుకున్న కరోనా ప్రజల్ని భయపెడుతోంది. మునుపటి కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వైరస్ను ఎంతవరకు అడ్డుకుంటాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మళ్లీ కొత్త వ్యాక్సిన్లు తయారు చేయాలా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బయోఎన్టెక్ సంస్థ స్పందించింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్.. బ్రిటన్లోని మ్యూటెంట్ కరోనా స్ట్రెయిన్ను సమర్థంగా ఎదుర్కోగలదని బయోఎన్టెక్ కో-ఫౌండర్ ఉగుర్ సహిన్ చెప్పారు. ఒకవేళ అవసరమైతే కొత్త రకం వ్యాక్సిన్ను తక్కువ వ్యవధిలోనే తీసుకొస్తామని స్పష్టం చేశారు. టెక్నికల్గా చెప్పాలంటే అందుకు 6 వారాలు సరిపోతాయన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ తయారీలో బయోఎన్టెక్ కంపెనీ సహ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
