ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలో పునాది వేసిన విశ్వేశ్వరయ్య

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలో పునాది వేసిన విశ్వేశ్వరయ్య

ఓ సారి అమెరికాలో 75 అడుగుల ఎత్తులోఉన్న ఒక మెషీన్​ పనితనాన్ని పరిశీలించాల్సి వచ్చింది. అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఇండియా తరఫున వచ్చిన ఒక ఇంజినీర్​ 75 అడుగుల పైకి నిచ్చెన ద్వారా ఎక్కి ఆ మెషీన్​ని ఇన్​స్పెక్షన్​ చేసి దిగాడు. అప్పటికాయన వయసు 85 ఏళ్లు. ఈ సంఘటన ఆయనలోని కర్తవ్యనిష్టకు, నిరాడంబరతకు నిదర్శనం.

వివిధ హెూదాల్లో పని చేస్తూ ఇంజనీరింగ్​లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కర్ణాటకలో కృష్ణసాగర్ డ్యాం,  భద్రావతి స్టీల్​ ప్లాంట్, మైసూర్ సాండల్ సోప్​ ఫ్యాక్టరీ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్​లో అనేక పథకాలను రూపొందించారు. సుక్కూరు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసేందుకు అసాధ్యమైన పథకాన్ని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశారు. నీటి వృధాను అరికట్టడానికి ‘బ్లాక్ సిస్టమ్’ అనే సరికొత్త పద్దతి అమలు చేయించారు.

హైదరాబాద్​లో మూసీ నది తరచుగా నగరాన్ని వరదలతో ముంచెత్తేది.  మూసీ నదిపై ఫ్లడ్​ కంట్రోల్​ స్కీమ్​ని సూచించమని అప్పటి నిజాం ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించగా ఉస్మాన్ సాగర్, హిమాయత్​ సాగర్​ రిజర్వాయర్లకు ప్లాన్​ ఇచ్చారు.ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​లో ఇంజనీరింగ్ ప్రాధాన్యతను నిరూపించిన మహా మనిషి మోక్షగుండం. అందుకే ఆయన జయంతి( సెప్టెంబర్​ 15)ని ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాం.

-పి.మోహన్ చారి