భూపాలపల్లి రూరల్, వెలుగు: సింగరేణిని ఆదాయ వనరుగా కాకుండా దోపిడీకి కేంద్రంగా మార్చింది గత బీఆర్ఎస్ప్రభుత్వమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చే సంస్కృతి ఒక్క కేసీఆర్ కుటుంబానికే చెల్లుతుందన్నారు. సింగరేణిని సర్వనాశనం చేసి, ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడటం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు. భూపాలపల్లికి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును రాజకీయ ప్రయోజనాల కోసం యాదాద్రికి తరలించారని ఆరోపించారు.
సింగరేణి పరిధిలోని ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను సిద్దిపేట, హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు తరలించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావు భూపాలపల్లి పర్యటనలో సింగరేణిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణిని బలహీనపరిచిన వారే ఇప్పుడు దాని గురించి నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు దేవన్ తదితరులు పాల్గొన్నారు.
