- మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్లోనూ ఓట్ చోరీ
- మా దగ్గర పక్కా ఆధారాలున్నయ్..
- దేశాన్ని విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం
- ‘ఇండియా’ కూటమి ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నది
- ఓట్ చోరీని అడ్డుకుంటే బిహార్లో 100% అధికారం తమదేనని రాహుల్ ధీమా
పచ్మర్హి (మధ్యప్రదేశ్):
దేశంలో ఓట్ చోరీని సంస్థాగతం చేసేందుకే ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్నారని, ఇందుకోసం బీజేపీతో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేతులు కలిపిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలో మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ ఓట్ చోరీ జరిగిందని అన్నారు. మధ్యప్రదేశ్ నర్మదాపురంలోని పచ్మర్హి పట్టణంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో రాహుల్గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజుల క్రితం నేను హర్యానాపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. ఓట్ల దొంగతనం జరుగుతున్నట్లు స్పష్టంగా చూపాను. 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయి. ప్రతి 8 ఓట్లలో ఒక ఓటు దొంగతనానికి గురైంది” అని ఆరోపించారు. ఆ డేటా చూశాక హర్యానాలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా అదే జరిగిందని తాను నమ్ముతున్నానని, ఇదీ బీజేపీ, ఎన్నికల సంఘం సిస్టమ్ అని వ్యాఖ్యానించారు.
మా దగ్గర చాలా సమాచారం ఉంది
ఇప్పుడు తమ ముందున్న ప్రధాన సమ్య ఓట్చోరీ, సర్ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్ చోరీకి సంబంధించి తమ వద్ద చాలా సమాచారం ఉందని, క్రమ క్రమంగా దాన్ని బయటపెడ్తామని చెప్పారు. ఇప్పటివరకూ కొన్ని ఆధారాలు మాత్రమే రిలీజ్ చేశామని తెలిపారు. ‘‘ఇప్పుడుw సమస్య ఏమిటంటే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నది.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కలిసి ఈ కుట్రలను నేరుగా అమలు చేస్తున్నారు. దీనివల్ల దేశం చాలా నష్టపోతోంది. దేశానికి హాని జరుగుతున్నది” అని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
ఓట్ చోరీని అడ్డుకుంటే మాదే అధికారం
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కడికెళ్లినా ఓట్చోరీలో దొరికిపోతారని రాహుల్గాంధీ అన్నారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కానీ.. -‘ఇండియా’ కూటమి మాత్రం దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. బిహార్లోని కిషన్గంజ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్గాంధీ మాట్లాడారు. ఓట్చోరీ ఆరోపణలపై మోదీ, షా సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవం ప్రజల ముందు ఉందని అన్నారు.
ఇటీవల తాను హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీకి గురైనట్టు బయటపెట్టానని, దీనిపై మోదీ, షాతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నోరువిప్పే ధైర్యం చేయలేదని తెలిపారు. ప్రజలంతా ఏకమై ఓట్ చోరీని అడ్డుకుంటే బిహార్లో 100 శాతం ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
నవంబర్ 11న ఓటు వేసేటప్పుడు పోలింగ్కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ చోరీని ప్రతి యువకుడు, కార్మికుడు, రైతు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం నితీశ్కుమార్ కలిసి ఉపాధిని నాశనం చేశారని, 20 ఏండ్లలో ఒక్క ఫుడ్ప్రాసెసింగ్యూనిట్కూడా పెట్టలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లేట్గా వచ్చినందుకు 10 పుషప్స్..
పచ్మర్హిలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి లేట్గా వచ్చినందుకు రాహుల్ గాంధీకి ఓ వింత పనిష్మెంట్ పడింది. బిహార్ ఎన్నికల ర్యాలీనుంచి నేరుగా మధ్యప్రదేశ్కు రావడంతో రాహుల్గాంధీకి కొంత ఆలస్యమైంది. దీంతో లేట్గా వచ్చినవారికి చిన్న శిక్ష ఉంటుందని శిక్షణా శిబిరం హెడ్ సచిన్ రావు సరదాగా అనగా.. ఏంచేయాలో చెప్పండని రాహుల్గాంధీ అడిగారు. 10 పుషప్స్ తీయాలని సచిన్ రావు ఆదేశించారు. దీంతో స్టేజీపై రాహుల్గాంధీ పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. లేట్గా వచ్చిన పలువురు జిల్లా అధ్యక్షులు ఆయనను ఫాలో అయ్యారు.
