డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో తలసాని పెత్తనమేంటి: కార్పొరేటర్ దీపిక

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో తలసాని పెత్తనమేంటి: కార్పొరేటర్ దీపిక

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెత్తనమేంటని మోండా మార్కెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక ప్రశ్నించారు. వెస్ట్ మారేడ్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర తమకు ఇండ్లు ఇవ్వాలంటూ లబ్ధిదారులు ధర్నాకు దిగారు. వారికి బీజేపీ కార్పొరేటర్ దీపిక మద్దతు తెలిపారు.

ఈ ప్రాంతంలో ప్రభుత్వం 468 ఇండ్లు కట్టారని.. అందులో 436 ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉందని.. కానీ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. 

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టక ముందు.. పట్టాదారులకు ఇండ్లు ఇస్తామని అమాయకపు ప్రజల దగ్గర స్థలాన్ని తీసుకున్నారని మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని కార్పొరేటర్ దీపిక విమర్శించారు. ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.